దర్శకుడితో గొడవా.. సిద్ధు క్లారిటీ


గత ఏడాది చిన్న స్థాయి సినిమాగా వచ్చి భారీ విజయాన్నందుకుంది ‘డీజే టిల్లు’. ఈ క్యారెక్టర్ జనాలకు మామూలుగా ఎక్కలేదు. ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డకు యూత్‌లో మాంచి ఫాలోయింగ్ వచ్చింది. తనకొచ్చిన క్రేజ్‌ను దుర్వినియోగం చేసుకోకూడదన్న ఉద్దేశంతో సిద్ధు.. వేరే సినిమాలు, పాత్రల జోలికి వెళ్లకుండా డీజే టిల్లు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా మొదలు కావడానికి ముందే రకరకాల ఊహాగానాలు, వివాదాలు దాన్ని చుట్టుముట్టాయి.

‘డీజే టిల్లు’ తీసిన దర్శకుడు విమల్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం చర్చనీయాంశం అయింది. అతడి స్థానంలోకి మల్లిక్ రామ్ వచ్చాడు. మరోవైపు ఈ సినిమాకు రెండు మూడుసార్లు కథానాయిక మారడం కూడా హాట్ టాపిక్ అయింది. ఇదంతా సిద్ధు యాటిట్యూడ్ వల్లే అంటూ సోషల్ మీడియాలో చాలా చర్చ నడిచింది. ఇప్పటిదాకా ఈ వివాదాలపై మాట్లాడని సిద్ధు.. తాజాగా స్పందించాడు

“సినిమాలో హీరోయన్‌, దర్శకుడి గురించి చాలా వార్తలు వస్తున్నాయి. నాకు, దర్శకుడు విమల్‌ కృష్ణకు మధ్య గొడవ జరిగి ఈ ప్రాజెక్ట్‌ నుంచి బయటకు వెళ్లిపోయాడని గాసిప్‌లు క్రియేట్‌ చేశారు. కానీ అది నిజం కాదు. డీజే టిల్లు-2 చేయాలనుకున్నప్పుడు మొదట సంప్రదించింది విమల్‌నే. అతనేమో.. ‘మళ్లీ అదే ప్రాజెక్టా? ఇంకేదైనా కొత్తగా చేద్దాం’ అన్నాడు. అతని మాటను గౌరవించి భవిష్యత్తులో మంచి ప్రాజెక్ట్‌ ఏదైనా చేద్దామని చెప్పా. అలా ‘టిలు స్వ్కేర్‌’లోకి మల్లిక్‌ వచ్చాడు.

ఈ హీరోయిన్‌ విషయానికొస్తే నేహా శెట్టిని నేనే ఈ ప్రాజెక్ట్‌ నుంచి వెళ్లిపోయేలా చేశానని కూడా రాశారు. తర్వాత అనుపమతో గొడవలని.. సెట్‌ నుంచి వెళ్లిపోయిందని రకరకాల వార్తలు మా చుట్టూ తిరిగాయి. అయితే వాటిని చదివి పగలబడి నవ్వుకునేవాళ్లం. ఎందుకంటే అందులో నిజం లేదు. ‘టిల్లు స్వ్కేర్‌’ తీయాలనుకున్నపుడు మేం అనుకున్న హీరోయిన్‌ అనుపమనే. ఇప్పుడు షూటింగ్‌ చేస్తోంది కూడా తనతోనే. ఊహాగానాలకు స్పందించాల్సిన అవసరం లేదు. రాసేవాళ్లు రాసుకుంటారు. మా పనిలో మేం బిజీగా ఉన్నప్పుడు వీటికి ఎందుకు స్పందించాలి” అని సిద్ధు అన్నాడు. ‘టిల్లు స్క్వేర్’.. ‘డీజే టిల్లు’కు సెకండ్ పార్ట్ కాదని.. సీక్వెల్ అని సిద్ధు క్లారిటీ ఇచ్చాడు.