శాకుంతలంది ఆందోళనా ఆత్మవిశ్వాసమా

ఇంకో రెండే రోజుల్లో శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అందులోనూ ప్యాన్ ఇండియా రేంజ్ లో అయిదు భాషల్లో రిలీజ్ జరుపుకోవడం చిన్న సంగతి కాదు. ప్రమోషన్ల విషయంలో దిల్ రాజు, గుణశేఖర్ లు తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. కానీ హైప్ చూస్తేనేమో ఆ స్థాయిలో లేదని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేస్తున్నాయి. మొన్న సోమవారం ప్రత్యేకంగా సాధారణ పబ్లిక్ కోసం వేసిన స్పెషల్ ప్రీమియర్ నుంచి రిపోర్ట్స్ పాజిటివ్ గానూ ఉన్నాయి డివైడ్ గానూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏది నిజమని చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉండగా బుధవారం ప్లాన్ చేసిన మీడియా షోని రద్దు చేశారు. అందరికీ ఫ్రైడేనే స్క్రీనింగ్ ఉంటుందని సందేశం పంపారు. సమంతాకు ఏదో కొద్దిగా నలతగా ఉండటం వల్ల ఇంకా చేయాల్సిన కొన్ని ఇంటర్వ్యూలు ప్రమోషనల్ ఈవెంట్లు క్యాన్సిల్ అయ్యాయని ఇన్ సైడ్ టాక్. ఇదంతా చూస్తుంటే శాకుంతలం టీమ్ ది ఆందోళనా ఆత్మవిశ్వాసమా అనే సందేహం రావడం సహజం. ఎందుకంటే కంటెంట్ చాలా గొప్పగా వచ్చిందనుకున్నప్పుడు రెండు రోజులు ముందే మీడియాకు వేయడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. పైపెచ్చు ఎక్స్ ట్రా పబ్లిసిటీ కూడా దక్కుతుంది.

అలా కాకుండా ఎందుకు వద్దనుకున్నారో ఏమో మరి. లేదూ అందరూ ఒకేసారి చూడాలన్న సంకల్పమైతే పబ్లిక్ షో వేయకుండా ఉండాల్సింది. ఇది పలు రకాల అనుమానాలకు తావిస్తోంది. రావణాసుర, మీటర్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏర్పడిన గ్యాప్ ని వాడుకోవడానికి శాకుంతలంకు బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంది. తెలంగాణలో గరిష్ట టికెట్ రేట్ వైపు మొగ్గు చూపడం బుకింగ్స్ మీద ప్రభావం చూపిస్తోంది. ఏపీలో చూస్తేనేమో అందుబాటు ధరలే ఉన్నా సేల్స్ స్లోగా ఉన్నాయి. మరి గుణశేఖర్ బృందానికి ఏ తరహా స్ట్రాటజీనో అర్థం కావాలంటే ఇంకో నలభై ఎనిమిది గంటలు ఎదురు చూడాలి