కనిపించని శత్రువుతో విరూపాక్ష పోరాటం

రిపబ్లిక్ విడుదలకు ముందు యాక్సిడెంట్ కు గురై తర్వాత కోలుకోవడానికి చాలా టైం పట్టిన సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమా విరూపాక్షతో ఈ నెల 21న థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ క్రైమ్ ఫాంటసీ థ్రిల్లర్ కు సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం. రెగ్యులర్ కథాంశాలకు భిన్నంగా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న విషయం పోస్టర్ల నుంచి అర్థమవుతూనే వచ్చింది. అందుకే దీని మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ దిల్ రాజు, అల్లు అరవింద్ అతిథులుగా ట్రైలర్ లాంచ్ చేశారు.

చుట్టూ అడవి, కొండలు, కోనల మధ్య ఓ చిన్న పల్లెటూరు. ఓ పని మీద అక్కడికొచ్చిన విరూపాక్షకు గ్రామీణ అందాలు ఆకట్టుకోవడమే కాదు ఓ అమ్మాయి(సంయుక్త మీనన్)ప్రేమ కూడా దక్కుతుంది. ఉన్నట్టుండి అక్కడ భయానకమైన పరిస్థితులు మొదలవుతాయి. జనాలు ఒక్కొక్కరుగా చనిపోతారు. గుడిని ఊరిని అష్టదిగ్బంధనం చేస్తాడు పూజారి(సాయిచంద్). ఇవన్నీ మూఢనమ్మకాల వల్ల జరుగుతున్నాయని గుర్తించిన విరూపాక్ష ఈ హత్యల వెనుక మిస్టరీని ఛేదించేందుకు పూనుకుంటాడు. కానీ ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదాలు వెంటాడతాయి. ఈ యద్ధంలో ఎలా గెలిచాడన్నదే స్టోరీ.

అనుభవం లేకపోయినా కార్తీక్ దండు టేకింగ్, విజువల్స్ పెద్ద స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ప్రేమకథ, రొమాన్స్ తో మొదలుపెట్టినా వేగంగా కథనాన్ని అసలు పాయింట్ వైపు పరుగులు పెట్టించారు. కాంతార, తుంబడ్ రేంజ్ లో ఆర్ట్ వర్క్ మెప్పించేలా ఉంది. అజనీష్ లోకనాథ్ నేపధ్య సంగీతం, శామ్ దత్ ఛాయాగ్రహణం క్వాలిటీకి దోహదపడ్డాయి. హీరో హీరోయిన్ కెమిస్ట్రీకి సుక్కు మార్కు టచ్ జోడించారు. మొత్తానికి అంచనాలు పెంచడంలో కార్తీక్ బృందం సక్సెస్ అయ్యింది. ఇదే స్థాయిలో పూర్తి కంటెంట్ ఉంటే మాత్రం ప్యాన్ ఇండియా హిట్టు కొట్టే ఛాన్స్ పుష్కలంగా ఉంది.