హాలీవుడ్ ప్యాట్రన్ అనుసరిస్తున్న దిల్ రాజు

ఎన్నడూ లేనిది శాకుంతలం ప్రీమియర్లు నాలుగు రోజుల ముందుగానే మొదలైపోయాయి. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ బిగ్ స్క్రీన్ లో ప్రత్యేకంగా పిలిచిన ఆహ్వానితులకు షో వేశారు. దాని రిపోర్టులు రివ్యూలు పక్కన పెడితే మరీ ఇంత ముందుగా షోలు వేయడం గురించి సరిగ్గా అదే సమయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు సమాధానం చెప్పారు. హాలీవుడ్ ప్యాట్రన్ ని ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నానని, అక్కడ నాలుగైదు రోజులు ముందుగానే స్క్రీనింగ్స్ వేస్తారని ఆ పద్ధతిని కంటెంట్ మీద నమ్మకంతో ఇక్కడ కూడా మొదలుపెట్టామని వివరణ ఇచ్చారు.

వినడానికి బాగానే ఉంది కానీ ఈ ప్యాట్రన్ మన ఆడియన్స్ కోణంలో సానుకూలంగా ప్రతికూలంగా రెండు రకాలుగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొదటిది మన జనాలకు సోషల్ మీడియా వాడకం ఎక్కువ. మనసులో ఉన్నది అక్కడ బహిర్గతం చేయకుండా ఉండలేరు. అది పాజిటివ్ కావొచ్చు లేదా నెగటివ్ కావొచ్చు. ఈ స్ట్రాటజీ రంగమార్తాండకు పని చేయలేదు. కానీ బలగంకు బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది. మొదటి రోజు పెద్దగా లేని ఆక్యుపెన్సీలు క్రమంగా హౌస్ ఫుల్స్ దాకా వెళ్లిపోయాయి. ఈ ట్రెండ్ రెండువైపులా పదునున్న ఆయుధం లాంటిది.

దిల్ రాజు, నిర్మాత గుణశేఖర్ శాకుంతలం ఫలితం మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీకే కనీసం ఒక్క రోజు ముందు షోలు వేసే సాహసం చేయలేదు. అలాంటిది సమంతా పేరు మీదే మార్కెటింగ్ జరుగుతున్న సినిమాని ఇంత ముందస్తుగా ప్రేక్షకులకు చూపించడం సాహసం. అడ్వాన్స్ బుకింగ్స్ లో మెల్లగా పెరుగుదల కనిపిస్తోంది. ఎలాగూ బాక్సాఫీస్ వద్ద నాని దసరా తర్వాత గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే శాకుంతలం జాక్ పాట్ కొట్టినట్టే. కాకపోతే యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. చూద్దాం మరి.