పల్లెటూళ్ళలో బలగం ఆరుబయట షోలు

మాములుగా సినిమా చూడాలంటే థియేటర్ కు వెళ్ళాలి లేదా ఓటిటిలో వచ్చే దాకా ఆగాలి. శాటిలైట్ ఛానల్స్ చూసే జనాలు తక్కువే. కానీ బలగం మాత్రం వీటికి భిన్నంగా కొత్త తరం మర్చిపోయిన పాత అనుభవాన్ని బయటికి తీసుకొస్తోంది. కొద్దిరోజుల నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ విలేజ్ బ్లాక్ బస్టర్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో చాలా పల్లెటూళ్ళలో కనీసం టెంటు హాలు లేనివి వేలల్లో ఉన్నాయి.

కొత్త బొమ్మ చూడాలంటే దగ్గరలో ఉన్న టౌనుకు పోవాల్సిందే. అలా అని అందరూ పోలేరు. అందుకే ఏకంగా గ్రామ పంచాయితీలు సెల్ఫ్ స్క్రీనింగ్ వేసుకుంటున్నాయి
అంటే ఊరి మధ్యలో ఎక్కడైనా పెద్ద ఖాళీ స్థలం చూసుకుని అక్కడో వంద నుంచి రెండు వందల ఇంచుల తాత్కాలిక తెర కట్టించో లేదా ఎల్ఈడి స్క్రీన్ పెట్టించో బలగంని ప్రదర్శిస్తున్నారు. షో టైంని ముందే చాటింపు వేయడం వల్ల ఆ సమయానికి చిన్నా పెద్ద తేడా లేకుండా వందల్లో జనం గుమికూడి బలగంని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

రెడ్డిపేట, సంగం, ముద్దాపూర్, దుద్దెడ, లక్ష్మణ్ చందా, ముస్కాల్, ఆశకొత్తూరు, జలాల్ పూర్, రాగన్న గూడెం, గుర్రాలగొంది, కాసారం, పడకల్, బస్వాపూర్ ఇలా చెప్పుకుంటూ ఈ లిస్టు చాంతాడంత ఉంది. వీటిలో ఎక్కడ థియేటర్లు లేకపోవడంతో గ్రామస్థులు, సర్పంచులు, పెద్దలు, జాతర నిర్వాహకులు, యువకులు ఇలా అందరూ ఒక్కటై ఇలాంటి స్క్రీనింగ్స్ లో భాగమవుతున్నారు.

ఈ స్థాయిలో స్పందన నిజానికి నిర్మాత దిల్ రాజుతో సహా ఎవరూ ఊహించనిది. అందులోనూ ఓటిటిలో వచ్చాక ఇళ్లలో కూర్చుని చూసేందుకు అలవాటు పడిపోయిన ట్రెండ్ లో ఇలా అందరూ సాయంత్రాలు కలిసి కూర్చుని బలగం లాంటి ఎమోషనల్ డ్రామాను చూసుకుంటూ మురిసిపోవడం నిజంగా గొప్ప అనుభూతి. దర్శకుడు వేణు యెల్దండి హిట్టొకటే కొట్టలేదు అంతకు మించే సాధించాడు