తెలంగాణ దర్శకులకి ‘బలగం’ చెప్పిన పాఠం

తెలంగాణా నుండి చాలా మంది దర్శకులు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వారి ప్రాంతం మీద సినిమా తీయలేదు సరే కానీ సెపరేట్ స్టేట్ వచ్చాక ఎందుకు అలాంటి ఆలోచన చేయలేదు ? ప్రస్తుతం బలగం చూసి ప్రేక్షకులు అనుకుంటున్న మాటలివి. అవును వేణు తెలంగాణా నటుడు. రాజన్న సిరిసిల్లలో పుట్టాడు. జబర్దస్త్ మానేసి మెగా ఫోన్ పట్టాలని డిసైడ్ అవ్వగానే అతనికి వచ్చిన ఆలోచన తెలంగాణా రూట్ కెళ్ళి ఓ సినిమా తీయాలి. కిందా మీదా పడ్డాడు. దిల్ రాజు సపోర్ట్ తో ఓ గొప్ప సినిమా ప్రేక్షకులకి అందించాడు. డెబ్యూ డైరెక్టర్ గా ఎవరూ అందుకోలేని ప్రశంసలు దక్కించుకుంటూ వేణు ది గ్రేట్ అనిపించుకుంటున్నాడు.

నిజానికి హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి , వంశీ పైడిపల్లి, దశరథ్, సంపత్ నంది , వేణు ఉడుగుల, తరుణ్ భాస్కర్ ఇలా తెలుగు ఇండస్ట్రీలో చాలా మందే తెలంగాణలో పుట్టిన దర్శకులున్నారు. కానీ ఎవరూ తమ ప్రాంతాన్ని స్క్రీన్ పై చూపించే ప్రయత్నం కానీ అలాంటి కథ కానీ ప్లాన్ చేసుకోలేదు. ఎన్ శంకర్ ఒక్కడే తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో జై బోలో తెలంగాణ సినిమా తీశాడు.

అయితే వేణులా తెలంగాణా సంప్రదాయాన్ని , ఇక్కడి సంస్కృతిని మిగతా వారికి చూపించాలనే ఆలోచన తెలంగాణా దర్శకులకి రాకపోవడం గమనార్హం. ఇప్పుడు బలగంకి వస్తున్న ఆధారణ , అభినందనలు , గౌరవం ఊహించని కలెక్షన్స్ చూస్తూ ఈ దర్శకులంతా ఇంత వరకూ ఇలా తమ ప్రాంతంలో మట్టి కథ గురించి ఆలోచించకుండా తప్పు చేశామని లోలోపల బాధ పడటం ఖాయం.

ఏదేమైనా దర్శకులుగా ఎన్నో ఏళ్ల నుండి ఉన్న కొందరు చేయాలేనిది ఒక కమెడియన్ దర్శకుడిగా మారి చేసి ఔరా అనిపించాడు. అందుకే వేణుకి తెలంగాణా ప్రజల నుండి ఎక్కువ గౌరవం అందుతుంది. కమర్షియల్ సినిమాలే కాదు ఇలాంటి కథలతో సినిమా తీసినా ప్రేక్షకులు చూసి కాసులు ఇస్తారని బలగం తెలంగాణా దర్శకులకి ఓ పాఠం చెప్పినట్టయింది.