దిల్ రాజుకు నచ్చితే అంతే మరి

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజును ఎవరైనా యువ దర్శకుడు ఇంప్రెస్ చేశాడంటే చాలు. ఏదో ఒక సినిమా తీసి వదిలిపెట్టేయరు. తన బేనర్లోనే వరుసగా సినిమాలు నిర్మిస్తారు. రాజు ఇచ్చే కంఫర్ట్ వల్లో ఏమో.. వేరే అవకాశాలు వచ్చినా కొందరు దర్శకులు బయటికి వెళ్లకుండా రాజుకే సినిమాలు చేస్తుంటారు.

బొమ్మరిల్లు భాస్కర్, వేణు శ్రీరామ్, వంశీ పైడిపల్లి.. ఇలా చాలామంది దర్శకులు బేనర్ నుంచే ప్రయాణం మొదలుపెట్టి.. తమ తర్వాతి చిత్రాలను కూడా ఆయన బేనర్లోనే చేశారు. ఇప్పుడు ఈ కోవలోకి ఇంకో దర్శకుడు చేరబోతున్నాడు. ఐతే ఆ దర్శకుడు పైన చెప్పుకున్న వారి మాదిరి కమర్షియల్ డైరెక్టర్ కాదు. ‘బలగం’ అనే చిన్న సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచిన వేణు వెల్దండి. కమెడియన్‌గా కూడా చిన్న స్థాయి వాడే అయిన వేణు దర్శకత్వంలో రాజు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే చాలామంది ఆశ్చర్యపోయారు.

జబర్దస్త్‌తో పాపులర్ అయిన కమెడియన్ కదా.. అందులో మాదిరే ఏదో కామెడీ సినిమా సినిమా తీసి ఉంటాడని అనుకున్నారు. కానీ అతను తెలంగాణ పల్లెటూళ్ల ఆత్మను పట్టుకుని హృద్యమైన సినిమా తీశాడు. వినోదం పండిస్తూనే ఎమోషన్లను పీక్స్‌కు తీసుకెళ్లి అందరి మనసులను తట్టాడు. ఈ సినిమా చూసిన వారంతా వేణును కొనియాడుతున్నారు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం దిల్ రాజుకు లాభాలే కాదు.. మంచి పేరునూ తీసుకొచ్చేలా ఉంది.

‘బలగం’ విషయంలో చాలా హ్యాపీగా ఉన్న రాజు.. వేణుతో ఇంకో సినిమా తీయడానికి రెడీ అయినట్లు సమాచారం. త్వరలోనే ఆ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుందట. ఈసారి కొంచెం బడ్జెట్ ఎక్కువే ఇచ్చి సినిమా చేయించనున్నాడట. పేరున్న తారాగణంతో వేణు సినిమా తీయబోతున్నాడట. కానీ ఈసారి కూడా తెలంగాణ నేపథ్యంలోనే సినిమా ఉంటుందని అంటున్నారు.