మంచి రికార్డుతో వీరయ్య హాఫ్ సెంచరీ

మెగాస్టార్ కి తిరుగులేని బ్లాక్ బస్టర్ అందించిన వాల్తేరు వీరయ్య దిగ్విజయంగా యాభై రోజులు పూర్తి చేసుకుంది. 67 కేంద్రాల్లో రెగ్యులర్ షోలతో ఈ ఫీట్ ని అందుకుంది. కొన్ని షిఫ్టింగ్ తో కలిపి ఈ నెంబర్ లో మార్పులు అటు ఇటుగా ఉండొచ్చు కానీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి పోస్టర్ తప్ప దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇదే ఫైనల్ అనుకోవాలి. ఆచార్య దారుణమైన డిజాస్టర్, మంచి టాక్ వచ్చినా లాంగ్ రన్ కు ఉపయోగపడని గాడ్ ఫాదర్ ఫలితం తరువాత ఈ స్థాయిలో కంబ్యాక్ అవ్వడం మెగా ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది.

మొదటి మూడు వారాలు భారీ వసూళ్లను రాబట్టిన వాల్తేరు వీరయ్య జోరు చూసి అల వైకుంఠపురములో పేరు మీద ఉన్న నాన్ బాహుబలి రికార్డులను చిరంజీవి అందుకుంటారని ఆశించిన ఫ్యాన్స్ కి చాలా సెంటర్స్ లో ఆ కోరిక నెరవేరలేదు. ఈ సినిమాతో పాటు వందకు పైగా ఫిఫ్టీ డేస్ సెంటర్లు కలిగిన అఖండ, రంగస్థలం లాంటి వాటిని వీరయ్య దాటలేకపోయాడు. అయితే వీరసింహారెడ్డి కన్నా డబుల్ నెంబర్స్ నమోదు కావడం విజేతగా నిలిపింది. దర్శకుడు బాబీ కథా కథనాల్లో కొత్తదనం లేకపోయినా వింటేజ్ చిరుని చూపించడంలో సక్సెస్ కావడం ఈ రిజల్ట్ ఇచ్చింది.

దీనివల్లే చిరంజీవి ఇప్పుడు చేస్తున్న భోళా శంకర్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. వేదాళం రీమేక్ కావడంతో ముందు నుంచి దీని మీద నెగటివ్ వైబ్స్ ఉన్నాయి. పైగా దర్శకుడు మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు ఫ్యాన్స్ ని భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పొరపాటుకి ఆస్కారం ఇవ్వకుండా ముందు అనుకున్న ఏప్రిల్ విడుదలని వాయిదా వేసుకుని మరీ కీలకమైన మార్పులు కొన్ని చేశారట. ఇది కూడా వాల్తేరు వీరయ్యలాగే రొటీన్ ఫార్ములాలో ఉంటూనే ఫ్యాన్స్ కోరుకునే అంశాలను జత చేశారు. ఇందులో చిరు పవన్ కళ్యాణ్ అభిమానిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.