దీపికా పదుకునేకు ఆస్కార్ ఆహ్వానం

ఇంకో తొమ్మిది రోజుల్లో జరగనున్న ఆస్కార్ సంబరానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ముఖ్యంగా భారతీయులు నాటు నాటుకి ఖచ్చితంగా అవార్డు వస్తుందనే నమ్మకంతో కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. రాజమౌళి రామ్ చరణ్ తదితరులు ఇప్పటికే యుఎస్ ప్రమోషన్లలో బిజీగా ఉండగా ఇంకో రెండు రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్, చంద్రబోస్ బయలుదేరబోతున్నారు. రాహుల్ సిప్లిగుంజ్ కాలభైరవలు ప్రయాణ ఏర్పాట్లలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల మూవీ లవర్స్ బహుశా ఎప్పుడూ లేనంత భారీ సంఖ్యలో ఈ ఈవెంట్ ని లైవ్ గా చూడబోతున్నారని ఒక అంచనా.

ఇదిలా ఉండగా ఇప్పుడీ వేడుకకు ప్రాజెక్ట్ కె హీరోయిన్ దీపికా పదుకునేకు ఆహ్వానం అందించింది. అయితే స్వీకరించడానికి కాదు లెండి. పురస్కార గ్రహీతల్లో ఒకరికి అందజేయడానికి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జెన్నిఫర్ కానెల్లి, అరియనా డీబోస్, సామ్యుల్ జాక్సన్, జోనాథన్ మేజర్స్ తదితర బృందంలో దీపికకు చోటు దక్కింది. తనతో ఎవరికి ఇప్పిస్తారనేది మాత్రం సస్పెన్స్. ముందే విజేతల వివరాలు బయటికి తెలిసే అవకాశం లేదు కాబట్టి ప్రత్యక్షంగా చూసే దాకా చెప్పలేం. ఈవెంట్ జరుగుతున్నపుడు యాంకర్ చెప్పాకే చూడాలి.

ఆస్కార్ 95లో ఈ గౌరవం అందుకున్న ఇండియన్ హీరోయిన్ దీపికనే. ప్రాజెక్ట్ కెతో టాలీవుడ్ కు పరిచయమవుతున్న ఈ బాలీవుడ్ భామకు తెలుగులో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి కానీ హిందీలోనే బిజీ ఉండటం వల్ల ఒప్పుకోలేకపోతోంది. ఎన్టీఆర్ 30కి సైతం అడిగారు కానీ ఈ కారణం వల్లే నో చెప్పింది. ప్రభాస్ మూవీలో రెగ్యులర్ హీరోయిన్ గా కాకుండా డిఫరెంట్ గెటప్ తో చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ లో దర్శకుడు నాగ అశ్విన్ ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న దీపికా తిరిగి వేసవిలో జాయినవుతుంది.