క‌మ‌ల్-మ‌ణిర‌త్నం.. ఒక వెరైటీ సినిమా

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ చిత్రాల్లో ఒక‌టిగా పేర్కొన‌ద‌గ్గ సినిమా.. నాయ‌కుడు. లెజెండ‌రీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం రూపొందించిన ఈ చిత్రం 1987లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కానీ 35 ఏళ్లు గడిచాక ఇప్పుడు చూసినా ఆ సినిమా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. ఇప్ప‌టి ప్రేక్షకులు కూడా ఆ చిత్రంతో క‌నెక్ట్ అవుతారు. అలాంటి క్లాసిక్ అందించిందిన హీరో, ద‌ర్శ‌కుడు ఇన్నేళ్ల‌లో మ‌ళ్లీ కలిసి ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

ఐతే గ‌త ఏడాది వీరి క‌ల‌యిక‌లో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పొన్నియ‌న్ సెల్వ‌న్‌-1తో భారీ విజ‌యాన్ని అందుకున్న ఉత్సాహంలో క‌మ‌ల్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు మ‌ణి.

ఈ చిత్రాన్ని క‌మ‌ల్ త‌న సొంత నిర్మాణ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ మీదే నిర్మిస్తుండ‌డం విశేషం. అనౌన్స్‌మెంట్ త‌ర్వాత వార్త‌ల్లో లేని ఈ చిత్రం.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ చిత్రం ఒక వెరైటీ క‌థాంశంతో తెర‌కెక్క‌నుంద‌ట‌. చ‌నిపోయిన ఒక మ‌నిషి మ‌ళ్లీ బ్ర‌తికి స‌మాజంలోకి వ‌స్తే ఎదురయ్యే ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంద‌ట‌. విన‌డానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించే పాయింటే ఇది.

మ‌ణిర‌త్నం నుంచి ఈ ద‌శ‌లో ఇలాంటి సినిమాను ఊహించ‌లేం. ఇంకో రెండు నెల‌ల్లోనే పొన్నియ‌న్ సెల్వ‌న్-2 విడుద‌ల కాబోతోంది. క‌మ‌ల్ కొన్ని నెల‌ల్లో ఇండియ‌న్-2 పూర్తి చేయ‌బోతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో వీరి కాంబినేష‌న్లో సినిమా సెట్స్ మీదికి వెళ్తుంద‌ని అంచ‌నా. ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఇంత‌క‌ముందు క‌మ‌ల్‌తో ఆమె మ‌న్మ‌థ‌బాణం, చీక‌టి రాజ్యం సినిమాలు చేసింది.