నాగార్జున పక్కన పాతికేళ్ల అమ్మాయి

మూడు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ ని దాటేసిన అగ్ర హీరోలకు హీరోయిన్ ని సెట్ చేయడం స్క్రిప్ట్ రాయడం కన్నా కష్టమైపోయింది దర్శకులకు. ఫామ్ లో లేని వాళ్ళను తీసుకుంటే ఫ్యాన్స్ తో తంటా. పోనీ కుర్రభామలను అడుగుదామా అంటే ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని అంత ఈజీగా ఒప్పుకోవడం లేదు. ఈ సమస్య చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లతో పాటు వీళ్ళ హయాం నుంచి మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న ప్రతిఒక్కరికి ఉంది. కోరినంత బడ్జెట్ చేతిలో ఉన్నా కేవలం ఈ కారణంగా షూటింగులు ఆలస్యమైన దాఖలాలు చాలానే ఉన్నాయి.

త్వరలో నాగ్ హీరోగా రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ కొత్త సినిమా మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈపాటికి రెగ్యులర్ షూటింగ్ జరగాల్సింది కానీ ఎందుకో కొంత ఆలస్యం జరుగుతూ వచ్చింది. తాజాగా ఇందులో నాగ్ కు జోడిగా 2020 మిస్ ఇండియా మానస వారణాసిని ఎంచుకున్నట్టు వచ్చిన వార్త గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. పాతికేళ్ల అమ్మాయి తో అరవై దాటేసిన నాగార్జున జోడి కంటికి ఆనుతుందా అనే అనుమానాలు రావడం సహజం. ఇదే డౌట్ ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మెల్లగా ట్రోల్స్ మొదలయ్యాయి

ధమాకా టైంలో రవితేజ సరసన శ్రీలీలని ఫిక్స్ చేసినప్పుడూ ఇలాంటి కామెంట్లు వచ్చి పడ్డాయి. తీరా తెరమీద ఇద్దరి ఎనర్జీ చూశాక ఎవరికి నోటమాట రాలేదు. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ జరిగిపోయింది. రైటర్ గా దానికి పనిచేసిన ప్రసన్న ఇప్పుడు డైరెక్టర్ గా అదే ఫార్ములా వాడబోతున్నారట. కాకపోతే కథ ప్రకారం నాగ్ చాలా యంగ్ లుక్ లో కనిపించే ఎపిసోడ్ ఒకటి ఉండటం వల్ల అక్కడ మానసిని తనతో ఆడిపాడేలా చూపిస్తారట. అఫీషియల్ గా త్వరలో ఖరారు చేయబోతున్నారు. మళయాలం రీమేకనే టాక్ ఉంది కానీ ఇంకా క్లారిటీ లేదు. ఇది కింగ్ కు తొంబై తొమ్మిదో సినిమా