పాండిబజార్లో చిరుకు అవమానం

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగు పెట్టి.. తన ప్రతిభ, కష్టంతో తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు చిరంజీవి. ఆయన ప్రయాణం ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగు పెట్టే ప్రతి వ్యక్తికీ స్ఫూర్తిదాయకం. ఐతే చిరు అంత తేలిగ్గా ఏమీ స్టార్ అయిపోలేదు. మద్రాసుకు వెళ్లి అవకాశాల కోసం చాలానే కష్టపడ్డాడు. సినిమాల్లోకి అడుగు పెట్టాక అన్ని రకాల పాత్రలూ చేశాడు. తర్వాత స్టార్ ఇమేజ్ తెచ్చుకుని ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు.

అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నపుడు తనకు కూడా అవమానాలు తప్పలేదని చిరు.. సింగర్ స్మిత నిర్వహిస్తున్న టాక్ షోలో వెల్లడించాడు. మద్రాస్‌లోని పాండీ బజార్లో తనుకు ఎదురైన చేదు అనుభవం గురించి ఈ కార్యక్రమంలో ఆయనేమన్నారంటే..

“ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా ఒక స్థాయిని అందుకునే క్రమంలో నేను కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. కొన్ని సందర్భాల్లో మానసిక క్షోభను అనుభవించాను. నా బాధను ఎవ్వరితోనూ పంచుకునేవాడిని కూడా కాదు. ఏ కష్టం వచ్చినా, ఎంత బాధ పడ్డా నాకు నేను సమాధానం చెప్పుకుని ముందుకు సాగేవాడిని. సినిమాల్లోకి రావాలనే ఆశతో మద్రాసు చేరుకున్న నేను ఒకసారి పాండీబజార్‌కు వెళ్లాను.

అక్కడ ఒక వ్యక్తి నన్ను చూసి.. ‘ఏంటి ఫిలిం ఇన్‌స్టిట్యూట్లోకి వచ్చావా? సినిమాల్లో ట్రై చేద్దామనే.? అతణ్ని చూడు ఎంతందంగా ఉన్నాడో.. తనకంటే నువ్వు అందగాడివా? ఇక్కడ తెలిసిన వాళ్లు లేకపోతే ఎదగడం కష్టమే. నీ కలను మర్చిపో’ అంటూ ఎగతాళిగా మాట్లాడాడు. ఆ మాటలకు చాలా బాధ పడ్డా. కానీ ఇంటికి వెళ్లాక దేవుడి ముందు కూర్చుని ఇలాంటి వాటికి బెదరకూడదని నిర్ణయించుకున్నా. మళ్లీ ఏడాది పాటు పాండీ బజార్ వైపే వెళ్లలేదు. ఇప్పుడు నన్నెవరైనా విమర్శిస్తే నవ్వుకుంటాను తప్ప.. అస్సలు బాధపడను” అని చిరు తెలిపాడు.