గ్రేట్ డైరెక్ట‌ర్‌కి ఘోర ప‌రాభ‌వం

బ్లాక్ ఫ్రైడే, దేవ్ డి, గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సీపూర్, ద‌ట్ గ‌ర్ల్ ఇన్ ద ఎల్లో బూట్స్ లాంటి చిత్రాల‌తో బాలీవుడ్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్యప్. చాలా త‌క్కువ సినిమాల‌తోనే అత‌ను గ్రేట్ డైరెక్ట‌ర్‌గా పేరు సంపాదించాడు. ఇండియాలో ఉన్న ప్ర‌పంచ స్థాయి ద‌ర్శ‌కుల్లో ఒక‌డిగా అత‌డికి గుర్తింపు ల‌భించింది.

కానీ అనురాగ్‌కు చాలా ఏళ్ల నుంచి స‌రైన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ మాత్రం లేదు. అత‌ను తీసే వెరైటీ క‌థ‌లు మాస్‌కు అస‌లు అర్థం కావు. త‌న సినిమాలకు థియేట‌ర్లు నిండ‌వు. ఈ మ‌ధ్య అయితే ప‌రిస్థితి మ‌రీ ఘోరంగా త‌యారైంది. సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన నెగెటివిటీ పెరిగిపోయి ఇబ్బంది ప‌డుతున్న ద‌ర్శ‌కుల్లో అనురాగ్ ఒక‌డు. గ‌త ఏడాది తాప్సీ ప‌న్నుతో అత‌ను తీసిన దోబారా పెద్ద డిజాస్ట‌ర్ అయింది.

ఆ త‌ర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని తాజాగా ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహ‌బ్బ‌త్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. యువ క‌థానాయిక ఆల‌యా ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్ర‌మిది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ అనురాగ్ స్ట‌యిల్లోనే కొంచెం క్రేజీగా, వెరైటీగా సాగుతుంద‌ట‌. ఐతే ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి దిగిన ఈ సినిమాను ప్రేక్ష‌కులు అస్స‌లు ప‌ట్టించుకోవ‌ట్లేదు. అస‌లీ సినిమా రిలీజైన సంగ‌తి కూడా తెలియ‌ట్లేదు. అనురాగ్ గ‌త సినిమాల‌తో పోలిస్తే దీనికి టాక్ కూడా ఏమంత బాగా లేదు.

ఒక‌ప్పుడు అనురాగ్ సినిమాలు తొలి రోజు మినిమం ప‌ది కోట్ల గ్రాస్ కొల్ల‌గొట్టేవి. కానీ ఇప్పుడు అందులో ప‌దో వంతు కూడా అసాధ్యంగా మారిపోయింది. బాలీవుడ్ ట్రేడ్ పండిట్ల అంచ‌నాల ప్ర‌కారం ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహ‌బ్బ‌త్ తొలి రోజు కేవ‌లం రూ.20 ల‌క్ష‌ల గ్రాస్ మాత్ర‌మే క‌లెక్ట్ చేసేలా ఉంద‌ట‌. తొలి రోజే ప‌రిస్థితి ఇలా ఉంటే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం రెండో రోజు ఏమాత్రం పెర్ఫామ్ చేస్తుందో అంచనా వేయొచ్చు. చూస్తుంటే రిలీజ్ ఖ‌ర్చులు కూడా వెన‌క్కి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.