ఖుషీ ఏం పాపం చేసింది

షూటింగ్ మొదలుపెట్టడం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఖుషి టీమ్ కి షాక్ ఇస్తూ సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో పాల్గొంటోందన్న విషయం కొద్ది రోజుల క్రితమే లీకైన సంగతి తెలిసిందే. దాన్ని ఇవాళ అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటిస్తూ సామ్ తమ టీమ్ తో ఉన్నట్టు చెప్పేసింది. దీంతో నిజాలకు పుకార్లకు అన్నింటికి చెక్ పడిపోయింది. కనీసం రెండు మూడు వారాల పాటు ఈ చిత్రీకరణ ఉండొచ్చని ముంబై టాక్. అప్పటిదాకా సామ్ హైదరాబాద్ వచ్చే ఛాన్స్ లేనట్టే. శాకుంతలం ఎలాగూ వాయిదా పడింది కాబట్టి ప్రమోషన్ల బరువు తప్పింది.

ఇక ఖుషీ విషయానికి వస్తే ఇంకో పాతిక శాతం కంటే తక్కువే బ్యాలన్స్ ఉందని యూనిట్ వర్గాల సమాచారం. గట్టిగా కూర్చుంటే ఒక నెలలో అయిపోవచ్చట. విజయ దేవరకొండ కేవలం ఈ మూవీ కోసమే ఎదురు చూస్తున్నాడు. అవతల గౌతమ్ తిన్ననూరి బౌండ్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే హెయిర్ స్టైల్ తో సహా విజయ్ దానికి ప్రత్యేకంగా మేకోవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే ఖుషి గెటప్ లోకి మారడం కష్టం. అందుకే ముందిది పూర్తి చేస్తే తర్వాత పోలీస్ యునిఫార్మ్ లోకి వెళ్లిపోవచ్చు. మైత్రి సంక్రాంతి రిలీజులు ఇతరత్రా వ్యవరాహలతో బిజీగా ఉండటం వల్ల పూర్తి ఫోకస్ పెట్టలేదు.

యశోద టైంలో ఎలాగైతే సామ్ తన నిస్సహాయ పరిస్థితి గురించి వివరణ ఇచ్చిందో ఇప్పుడు ఖుషికి సంబంధించి కనీసం ఒక ట్వీట్ లో ఏదైనా క్లారిటీ ఇస్తే బెటరని రౌడీ హీరో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. లేకపోతే కావాలని సిటాడెల్ కు వెళ్లిన కామెంట్లకు రెక్కలొస్తాయని భావిస్తున్నారు. శుభమాని ఆనారోగ్యం గురించి కోలుకుని బయటికి వస్తే ఇప్పుడిదంతా సమంతాకు ఇబ్బంది కలిగించే వ్యవహారమే. ఖుషి దర్శకుడు శివ నిర్వాణ త్వరలో రీ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పారు కానీ అదెప్పుడన్నది ఆయనా గట్టిగా చెప్పలేకపోయారు. అసలు ముహూర్తబలమే బాలేదేమో ఖుషికి ఒకటే బ్రేకులు.