శాకుంతలం వాయిదా పడినట్టే

సమంతా టైటిల్ రోల్ పోషిస్తూ గుణశేఖర్ స్వీయ దర్శక నిర్మాణంలో దిల్ రాజు భాగస్వామిగా రూపొందిస్తున్న శాకుంతలం ఫిబ్రవరి 17 నుంచి తప్పుకున్నట్టు ఫిలింనగర్ టాక్. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ వాయిదా మినహా మరో మార్గం లేనట్టుగా టీమ్ భావిస్తున్నట్టు వినికిడి. కారణాలు ఏంటా అని తరిచి చూస్తే చేతిలో ఉన్నది కేవలం పదహారు రోజులు. ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేయాలి. అంటే హైదరాబాద్ లో ఒకటే ఈవెంట్లు ఇంటర్వ్యూలు చేస్తే సరిపోదు. చెన్నై బెంగళూరు ముంబై అంటూ పలుచోట్ల తిరిగి రీచ్ పెంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ టైం చాలా తక్కువ.

అసలు సామ్ ముంబై నుంచి ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకైనా మంచిదని గుణశేఖర్ మీడియా ఇంటరాక్షన్లు మొదలుపెట్టారు కానీ ఈలోగా నిర్ణయం మారిపోయిందని వినికిడి. ఇది ముందే పసిగట్టడం వల్లే కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథని పోస్ట్ పోన్ చేయకుండా జాగ్రత్త పడ్డారనే కామెంట్ నిజమే అనిపిస్తుంది. అఫీషియల్ అయ్యేదాకా శాకుంతలంకు సంబంధించి ఇదంతా గాసిప్ గానే తీసుకోవాలి కానీ జరుగుతున్న పరిణామాలు పైన చెప్పిన అంశాలు చూస్తే పూర్తిగా కొట్టిపారేయలేం. వాస్తవమైతే మటుకు సమంతా ఫ్యాన్స్ కు షాకే.

యశోద సక్సెస్ తర్వాత మరో బ్రేక్ దక్కుతుందని ఆశపడిన సామ్ ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ షూట్ లో ఉన్నట్టు తెలిసింది. నిజానికి తనెక్కడ ఉందో స్పష్టంగా తెలియనంత గుట్టుని మైంటైన్ చేస్తోంది. శాకుంతలం పెట్టిన బడ్జెట్ కి వీలైనంత వరకు మంచి సీజన్ లో సోలోగా ప్రమోషన్లకు పుష్కలమైన సమయం ఉంచుకుని రావాలి తప్పించి హడావిడి చేస్తే ఓపెనింగ్స్ ఇబ్బందుల్లో పడతాయి. పైగా పఠాన్ దూకుడు కనీసం నెలరోజులు ఉంటుందన్న బాలీవుడ్ విశ్లేషకుల అంచనా. 17నే షెహజాదా రిలీజ్ నేపథ్యంలో శాకుంతలం వేసే ఏ అడుగైనా ఆలోచించి వేస్తే బెటర్. చూడాలి మరి ఏం జరగనుందో.