కీరవాణి మీద ఏఆర్ రెహమాన్ అభిమానం

మాములుగా ఎవరికైనా శుక్రమహర్దశ మధ్య వయసులో వస్తుంది. కానీ ఎంఎం కీరవాణి గారికి లేట్ ఏజ్ లోనూ అది వదిలిపెట్టడం లేదు. గోల్డెన్ గ్లొబ్ ఆనందం ఇంకా ఆస్వాదిస్తుండగానే ఆస్కార్ నామినేషన్ల వార్త నోట్లో తేనే పోసినంత పని చేసింది. ఆ సంతోషంగా ఇంకా పచ్చిగా ఉండగానే నిన్న కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. ముప్పై సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో ఈ సంగీత దిగ్గజం టాలీవుడ్ కు అందించిన సేవలు స్వరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటిది లెజెండరీ మ్యుజిషియన్ ఏఆర్ రెహమాన్ నోటి వెంట వింటే ఎలా ఉంటుంది.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ ప్రత్యేకంగా కీరవాణి గురించి ప్రస్తావించారు. ఎంఎం కీరవాణి గ్రేట్ కంపోజర్, కాకపోతే అండర్ రేటెడ్ గా మిగిలిపోయారు. నాకు తెలిసి 2015లో రిటైర్ అవ్వాలనుకున్నారు. నిజానికి ఆ టైంలోనే క్రీమ్ గారి అసలైన కెరీర్ మొదలయ్యింది. ఎప్పుడైతే విరామం తీసుకోవాలనుకున్నారో అప్పుడే ప్రపంచానికి తన మ్యూజిక్ గొప్పదనం తెలిసి వచ్చింది. ఇక్కడి దాకా తీసుకొచ్చింది. నా పిల్లలకు కీరవాణిగారిని కేస్ స్టడీగా తీసుకోమంటాను. లైఫ్ అయిపోయిందనుకున్న క్షణంలో తిరిగి కొత్త ఆశలతో ఎలా ప్రారంభించాలో చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చాను. వాళ్ళకది ఉపయోగపడుతుంది.

రెండుసార్లు ఆస్కార్ విజేతగా నిలిచిన రెహమాన్ ఇచ్చిన కాంప్లిమెంట్లివి. నిజమేగా. ఎప్పుడో 1990లో మనసు మమతతో తెలుగు సినిమా రంగప్రవేశం చేసిన కీరవాణి ఎన్నో గొప్ప ఆల్బమ్స్ ఇచ్చారు. ఘరానా మొగుడు లాంటి ఊర మాస్ సాంగ్స్, అన్నమయ్య టైపు ఆధ్యాత్మిక గీతాలు, పీపుల్స్ ఎన్ కౌంటర్ లాంటి విప్లవాత్మక గీతాలు ఒకటేమిటి అన్ని జానర్లలోనూ అద్భుతమైన కంపోజింగ్స్ చేశారు. ఇప్పుడు ఆస్కార్ గడప దాకా వెళ్లారు. రెహమాన్ మనస్పూర్తిగా నాటునాటుకి అకాడమీ అవార్డు వస్తుందని దానికా అర్హతలు పూర్తిగా ఉన్నాయని, ఆ గెలుపు క్షణం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.