పఠాన్ థియేటర్లకు పోలీస్ సెక్యూరిటీ

ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న షారుఖ్ ఖాన్ పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుమీదున్నాయి. హైదరాబాద్ తో సహా అన్ని ప్రధాన నగరాల్లో ఆన్ లైన్ అమ్మకాలు ఊపందుకున్నాయి. మొదటి రోజు రికార్డు ఓపెనింగ్ ఖాయమని బయ్యర్లు బల్లగుద్ది చెబుతున్నారు. జీరో డిజాస్టర్ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న బాద్షా మూవీ కావడంతో ఫ్యాన్స్ ఉద్వేగం మాములుగా లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన బేషరమ్ రంగ్ దే పాటలో దీపికా పదుకునే వేసుకున్న దుస్తులు, ఎక్స్ పోజింగ్ మీద తీవ్ర వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉండటంతో నిర్మాతలు అలెర్ట్ అయ్యారు.

పలు రాష్ట్రాలకు ముందుగానే విన్నపం చేసుకుంటున్నారు. గుజరాత్ ప్రభుత్వం స్పందిస్తూ జనవరి 25న పఠాన్ ప్రదర్శించే థియేటర్ల వద్ద సెక్యూరిటీ అందించాలని పోలీస్ డిపార్ట్ మెంట్ ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా షోలకు అడ్డుకోవాలని చూసినా మధ్యలో అల్లర్లు చేసినా వెంటనే ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన మంత్రులకు పార్టీ క్యాడర్ కు పఠాన్ మీద అనవసర వ్యాఖ్యలు చేసి వివాదాలు సృష్టించవద్దని ముందస్తుగానే చెప్పినట్టు వచ్చిన వార్త ముంబై మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సో పఠాన్ కట్టుదిట్టంగానే రంగంలోకి దిగబోతున్నాడు.

మొదటి రోజు ఫిగర్స్ మీద అంచనాలు రకరకాలుగా ఉన్నాయి కానీ సులభంగా వంద కోట్లు వచ్చేస్తాయని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. పాజిటివ్ టాక్ రావడం మీద తర్వాత నమోదయ్యే వసూళ్లు ఆధారపడి ఉంటాయి. యావరేజ్ గా ఉన్నా చాలు షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ ని తన కంట్రోల్ లోకి తీసుకుంటాడు. ట్రైలర్ కట్ లో యాక్షన్ విజువల్స్ ని భీభత్సంగా జొప్పించేయడంతో అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి. తెలుగు డబ్బింగ్ సిద్ధం కావడంతో ఏపీ తెలంగాణలోనూ యష్ రాజ్ సంస్థ భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి సినిమాలు అప్పటికి నెమ్మదయిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు.