షారుఖ్ తెలివైన నిర్ణయం

ఇండియాలో సినిమాల ప్రమోషన్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లిన ఘనత బాలీవుడ్‌దే. ఒకప్పుడు సినిమా తీస్తున్నపుడు మధ్య మధ్యలో పత్రికలకు షూటింగ్ అప్‌డేట్స్ ఇవ్వడం.. రిలీజ్ ముంగిట ఒక ఆడియో వేడుక చేయడం.. పోస్టర్లు ప్రింట్ చేసి వీధుల్లో అంటించడం.. టీవీల్లో యాడ్స్ ఇవ్వడం.. ఇక్కడి వరకే ఉండేది పబ్లిసిటీ అంటే.

కానీ హీరోలు రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తిరుగుతూ రకరకాల ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనడం.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. సోషల్ మీడియాలోనూ హడావుడి చేయడం.. ఈ ట్రెండ్‌ తీసుకొచ్చింది బాలీవుడ్ హీరోలే. ఆమిర్ ఖాన్.. ఆ తర్వాత మిగతా బాలీవుడ్ స్టార్లు ఈ ట్రెండ్‌‌ను పాపులర్ చేశారు. తర్వాత మిగతా ఫిలిం ఇండస్ట్రీల హీరోలు కూడా ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకోక తప్పలేదు. ఐతే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ల ఆలోచన మారిపోతోంది. సినిమాను ప్రమోట్ చేయకుండా ఉండడమే సరైన ప్రమోషన్ అనే ఆలోచనలోకి వాళ్లు వెళ్లిపోతుండడం గమనార్హం.

ఆ మధ్య అజయ్ దేవగణ్ ‘దృశ్యం-2’ సినిమాను అసలేమాత్రం ప్రమోట్ చేయలేదు. ఒక ఈవెంట్‌లో పాల్గొనలేదు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. మంచి ట్రైలర్ ఒకటి వదిలారు. అది క్లిక్ అయింది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. లాంగ్‌రన్‌తో మంచి లాభాలు తెచ్చుకుంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ సైతం ఇదే ట్రెండును ఫాలో అవబోతున్నాడట. తన కొత్త చిత్రం ‘పఠాన్’కు సంబంధించి ఏ ప్రమోషనల్ ఈవెంట్లోనూ పాల్గొనడట. అలాగే మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడట. తన సినిమా ప్రోమోలే కావాల్సినంత బజ్ తీసుకొస్తాయని షారుఖ్ భావిస్తున్నాడు.

అన్నింటికీ మించి మీడియాతో మాట్లాడితే.. లేనిపోని వివాదాలు మొదలై సినిమాకు చేటు చేస్తాయని షారుఖ్ సహా బాలీవుడ్ హీరోలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. కొంత కాలంగా బాయ్ ‌కాట్ ట్రెండ్ బాలీవుడ్‌ను ఎలా దెబ్బ తీస్తోందో తెలిసిందే. చిన్న కామెంట్‌ను పట్టుకుని సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రెండ్ చేయడం.. సినిమాను టార్గెట్ చేయడం రివాజుగా మారుతోంది. ‘పఠాన్’లో ఒక పాటకు సంబంధించి ఇప్పటికే పెద్ద వివాదం నడిచింది. అది ఈ మధ్యే కొంచెం సద్దుమణిగింది. ఇప్పుడు షారుఖ్ మళ్లీ ప్రమోషనల్ ఈవెంట్లకు, ఇంటర్వ్యూలకు హాజరు కావడం.. మీడియా వాళ్లు ఏదో ఒక వివాదాస్పద ప్రశ్న వేయడం.. దానికి ఇచ్చిన జవాబు మీద కొత్త కాంట్రవర్శఈ క్రియేటై సినిమాకు చేటుగా మారడం.. ఇవన్నీ ఎందుకని షారుఖ్ తెలివిగా ప్రమోషన్లకు దూరంగా ఉండాలని ఫిక్సయిపోయాడు.