శ్రుతిని ఎవరైనా బెదిరించారా-చిరు

మెగాస్టార్ చిరంజీవి తన కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’కు సంబంధించి విశాఖపట్నంలో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ‘వాల్తేరు వీరయ్య’ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ప్రొడ్యూస్ చేసిన ‘వీరసింహారెడ్డి’ కూడా సంక్రాంతికే రిలీజవుతుండగా.. అందులో కథానాయికగా నటించిన శ్రుతినే ఇందులోనూ హీరోయిన్‌గా చేయడం తెలిసిందే.

మరి ఈ రెండు చిత్రాల ప్రమోషన్లను ఆమె ఎలా బ్యాలెన్స్ చేస్తుందా అని అంతా ఎదురు చూస్తుండగా.. ఒంగోలులో మొన్న జరిగిన ‘వీరసింహారెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో శ్రుతి పాల్గొని సందడి చేసింది. ‘వాల్తేరు వీరయ్య’ వేడుకలోనూ అలాగే తళుక్కుమంటుందని అనుకుంటే.. ఆమె ఈ వేడుకలో పాల్గొనలేదు. తనకు జ్వరంగా ఉండడం వల్ల ఈ వేడుకలో పాల్గొనలేకపోతున్నట్లు ఆమె క్లారిటీ ఇచ్చింది.

ఐతే ‘వాల్తేరు వీరయ్య’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరు ప్రసంగిస్తూ శ్రుతి ప్రస్తావన వచ్చేసరికి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రుతి ఈ ఈవెంట్‌కు రాలేదని.. ఆమె ఒంగోలులో ఏం తిందో ఏమో అని.. ఆమెను ఎవరైనా బెదిరించారో ఏమో తెలియదని చిరు నవ్వుతూ అన్నాడు. తిండి సంగతి పక్కన పెడితే.. ఎవరైనా బెదిరించారేమో అన్న మాటను బాలయ్య ఫ్యాన్స్ పట్టుకున్నారు. బాలయ్యే బెదిరించి ఈ వేడుకకు శ్రుతి రాకుండా చేశాడనే అర్థం వచ్చేలా చిరు మాట్లాడాడంటూ.. ఆయన్ని వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. దీనికి మెగా అభిమానులు కూడా దీటుగా బదులిస్తున్నారు.

కొందరేమో చిరు సరదాగా ఈ వ్యాఖ్య చేశాడని… ఇందులో వివాదం అనవసరమని అంటున్నారు. తన ప్రసంగం చివర్లో ‘వీరసింహారెడ్డి’ గురించి చిరు ప్రత్యేకంగా ప్రస్తావించి ఆ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకున్నాడు. ఇలా మాట్లాడిన చిరు.. బాలయ్య మీద సీరియస్‌గా కౌంటర్ ఎందుకు వేస్తాడని.. ఆయన సరదాకే ఈ వ్యాఖ్య చేసి ఉంటాడని అంటున్నారు.