‘వీరసింహారెడ్డి’ని జగన్ వదులుతాడా?

శుక్రవారం రిలీజైన నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ అంచనాలను అందుకుంది. బాలయ్య అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్, డైలాగ్స్‌కు ఢోకా లేకపోవడంతో ట్రైలర్ ఇన్‌స్టంట్‌గా హిట్టయిపోయింది. సినిమా మీద అంచనాలు ఇంకా పెంచేసింది. ఈ ట్రైలర్లో ఎక్కువగా చర్చనీయాంశం అయిన డైలాగ్స్ కొన్ని ఉన్నాయి.

అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. ‘‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు, మార్చలేరు’’ అనే డైలాగ్ గురించే. ఈ డైలాగ్ ఉద్దేశమేంటో అందరికీ ఈజీగానే అర్థమైపోయింది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరులోంచి ‘ఎన్టీఆర్’ తీసేసి ‘వైఎస్ఆర్’ పేరును చేర్చడం ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కారుకు కౌంటర్ వేస్తూ బాలయ్య ఈ డైలాగ్ రాయించుకున్నట్లున్నాడు.

దీంతో పాటు ‘‘పవర్ చూసుకుని నీకు పొగరేమో. బై బర్త్ నా డీఎన్‌యేకే పొగరెక్కువ’’ అనే డైలాగ్ కూడా ఏపీ ప్రభుత్వాధినేతను ఉద్దేశించే అన్న చర్చ నడుస్తోంది. ఈ డైలాగ్స్ టీడీపీ వాళ్లకు ఎంత జోష్ ఇచ్చి ఉంటాయో.. వైకాపా వాళ్లకు అంత మంట పుట్టించి ఉంటాయనడంలో సందేహం లేదు. ఇప్పటికే వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో రంగంలోకి దిగిపోయారు. బెల్లంకొండపై కాల్పులు సహా రకరకాల విషయాలను తీసుకొచ్చి బాలయ్యకు ప్రశ్నలు సంధిస్తున్నారు. టీడీపీ వాళ్లు దీటుగానే బదులిస్తున్నారు.

ఐతే ఈ గొడవ సోషల్ మీడియా వరకు పరిమితం అవుతుందా అన్నదే డౌట్. ఎందుకంటే తనను ఎవరైనా టార్గెట్ చేసినా, తనకు ఇష్టం లేని విధంగా వ్యవహరించినా జగన్ ఊరుకునే టైపు కాదు. పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఎలా వేధింపులు జరిగాయో.. ఎన్ని అడ్డంకులు సృష్టించారో తెలిసిందే. ఇప్పుడు బాలయ్య డైరెక్టుగా జగన్‌కు కౌంటర్ వేయడంతో ‘వీరసింహారెడ్డి’ వైసీపీ ప్రభుత్వం అంత ఈజీగా వదులుతుందా అని డౌటు. ఈ సినిమాకు స్పెషల్ షోలు, అదనపు టికెట్ల రేట్ల కోసం మైత్రీ అధినేతలు కొన్ని రోజుల నుంచి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే అనుకున్న టైంలో ట్రైలర్లో డైలాగులు జగన్ సర్కారుకు సూటిగా తాకాయి. దీంతో స్పెషల్ షోలు, ఎక్స్‌ట్రా రేట్ల విషయంలో ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా.. వేరే మార్గాల్లోనూ సినిమాను ఇబ్బంది పెట్టకుండా ఉంటుందా అన్న చర్చ నడుస్తోంది.