దేవిపై నమ్మకం వచ్చేసింది

వాల్తేరు వీరయ్యకి Devi Sri Prasad ని సంగీత దర్శకుడిగా ప్రకటించినప్పుడు అభిమానుల్లో బోలెడు సందేహాలు. ఒకప్పటి ఫామ్ బాగా తగ్గిపోవడం, సుకుమార్ కు తప్ప మిగిలినవాళ్లకు ఆశించిన స్థాయిలో ఆల్బమ్స్ ఇవ్వకపోవడంతో రకరకాల అనుమానాలు తలెత్తాయి. దానికి తగ్గట్టే మహేష్ బాబు కోరి మరీ సరిలేరు నీకెవ్వరు ఇస్తే మంచి పాటలే చేసినా అల వైకుంఠపురములో ముందు తక్కువే అనిపించడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గట్టిగానే నిలదీశారు. ఎఫ్3 కూడా కామెడీ కంటెంట్ వల్ల ఆడిందే తప్ప దేవి వైపు నుంచి చెప్పుకునే కాంట్రిబ్యూషన్ అంతగా ఏం లేదు.

ఇన్ని రకాల డౌట్ల మధ్య వచ్చిన దేవి ఫైనల్ గా ఒత్తిడిని గెలిచినట్టే కనిపిస్తోంది. ముందు ట్రోలింగ్ కి గురైన బాస్ పార్టీ ఇప్పుడు 33 మిలియన్ల వ్యూస్ దాటేసి నెంబర్ వన్ సాంగ్ ప్లేస్ లో ఉంది. నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతాకు మరీ భీభత్సమైన రెస్పాన్స్ రాలేదు కానీ స్క్రీన్ మీద చూశాక రీచ్ పెరుగుతుందని ఫ్యాన్స్ నమ్మకం. నిన్న సాయంత్రం నాన్చీ నాన్చీ ఆలస్యంగా రిలీజ్ చేసిన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. పాత దేవిని గుర్తు చేశాడంటూ Chiranjeevi ఎలివేషన్లకు తగ్గట్టు స్కోర్ బాగా కుదిరిందని సాహిత్యం మీద కూడా ప్రశంసలు కురుస్తున్నాయి

అసలైన చిరంజీవి రవితేజల కాంబో పాట పూనకాలు లోడింగ్ బాలన్స్ ఉంది. ఇవే ఈ స్థాయిలో ఉంటే ఇంక దాని గురించి చెప్పేదేముంది. ఇవి కాకుండా మరో డ్యూయెట్ చివర్లో రావొచ్చు. మొత్తానికి దేవిని నమ్మొచ్చనే భరోసా అయితే ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంచనాలకు తగ్గట్టు ఇస్తే వీరయ్యకున్న ప్రధానమైన టెన్షన్ తీరినట్టే. అసలే అవతల మరో ఊర మాస్ బొమ్మ వీరసింహారెడ్డితో Thaman పోటీ ఇస్తుండటంతో దేవికి అంచనాలను నిలబెట్టుకునే ఒత్తిడి చాలా ఉంది. శంకర్ దాదా ఎంబిబిబీఎస్ తర్వాత ఆ స్థాయి స్పందన దీనికే వచ్చింది. నిలబెట్టుకోవడమే తరువాయి.