సరిగ్గా ఏడాది ముందు.. ఒక సంచలనం

జ్యోతిలక్ష్మీ.. లోఫర్.. ఇజం.. రోగ్.. పైసా వసూల్.. మెహబూబా.. పూరి జగన్నాథ్ ‘టెంపర్’ తర్వాత తీసిన సినిమాలివి. వీటిలో ఏ సినిమా కూడా ఓ మోస్తరు విజయాన్నందుకోలేదు. అన్నీ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయిన చిత్రాలే. తన గురువు రామ్ గోపాల్ వర్మ బాటలోనే పూరి కూడా పయనిస్తున్నాడని.. ఆయన పనైపోయిందని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేసిన సమయం అది. అలాంటి తరుణంలో యువ కథానాయకుడు రామ్‌.. పూరితో పని చేయడానికి ముందుకొస్తే అతడికేమైనా పిచ్చా అన్నట్లుగా చూశారంతా. వీళ్ల కలయికలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్‌తో కొత్త సినిమా అనౌన్స్ చేస్తే.. ఏముంది ఇందులో అన్నట్లుగా చూశారు జనాలు.

ఫస్ట్ లుక్.. టీజర్.. ట్రైలర్.. ఆడియో.. ఒకదాని తర్వాత ఒకటి రిలీజయ్యాయి. ఏవి కూడా మరీ ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. పూరి ఖాతాలో మరో ఫ్లాప్ ఖాయం అన్నట్లుగానే ఉన్నాయి కొన్ని రోజుల ముందు వరకు అంచనాలు. కానీ విడుదల దగ్గర పడేసరికి పరిస్థితి మారిపోయింది. ‘ఇస్మార్ట్ శంకర్’ బుకింగ్స్ చూసి అంతా షాకైపోయారు. ఏంటి క్రేజ్ అనుకున్నారు. అయినా సినిమా ఆడుతుందన్న నమ్మకం చాలామందిలో లేదు. సినిమా రిలీజైతే అంతా చల్లబడిపోతుందిలే అంటూ కౌంటర్లు వేశారు. కానీ బొమ్మ పడింది. థియేటర్లు దద్దరిల్లాయి. రివ్యూలు యావరేజ్‌గా వచ్చినా సరే.. అవేమీ పట్టించుకోకుండా మాస్ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని కట్టబెట్టారు.

ఒక స్టార్ హీరో సినిమా స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీసై దగ్గర వసూళ్ల మోత మోగించింది. రూ.50 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. 2019 సంవత్సరానికి బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. రామ్‌కు ఇది కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో పూరి మళ్లీ తన సత్తా చూపించి.. ఇండస్ట్రీ అంతా మళ్లీ తన వైపు తిరిగి చూసేలా చేశాడు. విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ స్టార్‌తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. ఈ సంచలన విజయానికి ఈ రోజు (జులై 18)తో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పూరి, రామ్, ఛార్మి సహా యూనిట్ సభ్యులందరూ తమ ఉద్వేగాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.