వీర‌మ‌ల్లు టెన్ష‌న్ తీర్చిన ప‌వ‌న్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌రుస‌గా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి సినిమాలు అనౌన్స్ అవుతుంటే.. ఎలా స్పందించాలో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది అభిమానుల్లో. చేతిలో ఉన్న భారీ చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సంగ‌తి తేల్చ‌కుండా, ఎంత‌కీ ఆ సినిమాను పూర్తి చేయ‌కుండా కొత్త‌గా సినిమాలు ప్ర‌క‌టించి ఏం ప్ర‌యోజ‌నం అనుకున్నారు వారు. ఇక ఆ చిత్ర ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత ఎ.ఎం.ర‌త్నంల ప‌రిస్థితేంటో చెప్పాల్సిన ప‌ని లేదు.
కొన్నేళ్లుగా వాళ్లిద్ద‌రూ ఈ ప్రాజెక్టుకే అంకిత‌మై ఉన్నారు. ఖ‌ర్చు త‌డిసి మోపెడ‌వుతుండ‌డం ర‌త్నంలో టెన్ష‌న్ పెంచేస్తోంది. ప‌లుమార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా చివ‌ర‌గా 2023 వేస‌వికి ఫిక్స్ అయింది. కానీ ప‌వ‌న్ తీరు చూస్తుంటే అప్ప‌టికైనా సినిమా రిలీజ‌వుతుందా లేదా అన్న సందేహాలు క‌లిగాయి. కానీ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీం టెన్ష‌న్ తీరుస్తూ.. ప‌వ‌న్ ఇటీవ‌ల నిల‌క‌డగా షూటింగ్‌కు హాజ‌రు కావ‌డం విశేషం.

చాలా నెల‌ల త‌ర్వాత ప‌వ‌న్‌.. గ్యాప్ ఇవ్వ‌కుండా దాదాపు రెండు వారాలు రెగ్యుల‌ర్‌గా షూటింగ్‌కు వ‌చ్చాడ‌ట‌. రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్స్‌, పెద్ద సంఖ్య‌లో ఆర్టిస్టులు, వేల‌మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల కాంబినేష‌న్లో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను ప‌వ‌న్ పూర్తి చేశాడ‌ట‌. ఈ షెడ్యూల్ బ్రేక్ లేకుండా సాగిపోవ‌డంతో మేజ‌ర్ పార్ట్ ఫినిష్ అయిపోయిన‌ట్లు స‌మాచారం.

షెడ్యూల్ మొద‌ల‌య్యే ముందు నెల‌కొన్న సందేహాలను ప‌టాపంచ‌లు చేస్తూ ప‌వ‌న్ వ‌రుస‌గా షూటింగ్‌కు రావ‌డం చిత్ర బృందంలో మంచి హుషారు తెచ్చిన‌ట్లు స‌మాచారం. ఇలా ఇంకో మూడు వారాలు ప‌వ‌న్ కాల్ షీట్లు ఇస్తే సినిమా పూర్త‌యిపోతుంద‌ని తెలుస్తోంది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆల్రెడీ లైన్లో ఉన్న రెండు సినిమాల సంగ‌తి కూడా చూసేసి ఆ త‌ర్వాత ఎన్నిక‌ల కోసం పూర్తిగా స‌మ‌యం కేటాయించాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.