శ్రీదేవి కూడా స్లో పాయిజన్ అవుతుందా

ఒకప్పటి ఫామ్ లో లేడని ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్న దేవిశ్రీప్రసాద్ కు వాల్తేరు వీరయ్య చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకపక్క దీనికి పోటీగా గత రెండేళ్లుగా చెలరేగిపోతున్న తమన్ కంపోజ్ చేస్తున్న వీరసింహారెడ్డి ఉంది. మరోవైపు చిరంజీవికి ఖైదీ నెంబర్ 150 తర్వాత ఇస్తున్న ఆల్బమ్ కావడంతో రెండు రకాలుగా దేవి మీద ఒత్తిడి ఉంది. తనపై నెగటివ్ క్యాంపైన్ ఏ స్థాయిలో ఉందంటే కేవలం బాస్ పార్టీ ప్రోమోకే సోషల్ మీడియాలో ట్రోలింగ్ తో చెడుగుడు ఆడేశారు. కట్ చేస్తే ఇప్పుడదే ఛార్ట్ బస్టర్ అయిపోయి ఏకంగా ముప్పై మిలియన్ల వ్యూస్ దాటే దిశగా పరిగెత్తుతోంది. గ్రౌండ్ లెవెల్ లో దీని రీచ్ ఇంకో స్థాయిలో ఉంది

తాజాగా నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అంటూ సాగే పాటను నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు. ఫ్రాన్స్ లో షూట్ చేసిన విజువల్స్ బాగున్నాయి. సింపుల్ గా ఉన్నప్పటికీ మెగాస్టార్ సిగ్నేచర్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి. అందరూ భయపడినట్టు దేవి గాత్రంతో కాకుండా వేరే సింగర్స్ తో పాడించారు. ట్యూన్ ఓ అద్భుతం అనే రేంజ్ లో లేదు కానీ డీసెంట్ గానే సాగింది. అయితే ట్విట్టర్ తదితర ప్లాట్ ఫార్మ్స్ లో మిశ్రమ స్పందనే దక్కుతోంది. ముందు ఇలా అనిపించి తర్వాత స్లో పాయిజన్ లా ఎక్కేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అది జరిగితే దేవికి రెండో పాట గండం తప్పినట్టే.

వీరసింహారెడ్డిలో జై బాలయ్య పాట బాస్ పార్టీని దాటలేకపోయినా మంచి స్పందనే దక్కించుకుంది. దానికన్నా ఎక్కువ ఫాస్ట్ బీట్ తో సాగే సుగుణ సుందరి వేగంగా దూసుకుపోతోంది. వచ్చే వారం ఐటెం సాంగ్ రాబోతోంది. ఇది అసలు బ్లాస్ట్ అని దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు యూనిట్ సభ్యులు ఊరిస్తున్నారు. మొత్తానికి పక్కా ప్లానింగ్ తో ఏదీ ఎక్కువ తక్కువ అనిపించకుండా రెండు సినిమాలకు మైత్రి సంస్థ చేస్తున్న ప్రమోషన్ ప్లానింగ్ ఇప్పటిదాకా చక్కగా సాగింది. ఇద్దరు హీరోల అభిమానులను సంతృప్తి పరిచేలా నడిపించారు. ఇంకొక్క ఇరవై రోజులు ఇదే కంటిన్యూ చేస్తే సరి