‘భారతీయుడు-2’ లైన్ ఇదే

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల జాబితా తీస్తే అందులో ‘భారతీయుడు’ కచ్చితంగా ఉంటుంది. కథాకథనాల పరంగా కొత్తగా ఉంటూనే కమర్షియల్ హంగులకూ లోటు లేని ఆ చిత్రం రెండు దశాబ్దాల కిందట భారీ విజయాన్ని అందుకుంది. హీరోగా కమల్ హాసన్, దర్శకుడిగా శంకర్ కెరీర్లలో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘భారతీయుడు’కు సీక్వెల్ తీయాలని మూడేళ్ల కిందట ఫిక్సయి.. సినిమాను పట్టాలెక్కించారు. కానీ రకరకాల కారణాలతో ఆ సినిమాకు బ్రేక్ పడింది. దాదాపు రెండేళ్లు ఈ చిత్రంలో ఏ కదలికా లేదు. కానీ కొన్ని నెలల కిందట అన్ని ఇబ్బందులనూ అధిగమించి షూటింగ్‌ను పున:ప్రారంభించారు.

‘విక్రమ్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. గత దశాబ్ద కాలంలో తన స్థాయికి తగ్గ సినిమాను అందివ్వలేకపోయిన శంకర్.. ‘ఇండియన్-2’తో సత్తా చాటుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

కాగా ‘భారతీయుడు-2’ కథ విషయంలో ఆ చిత్ర రచయిత జయమోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా ప్లాట్ గురించి ఆయన వివరిస్తూ.. ‘‘ఇండియన్ సినిమాను చూసిన అనుభూతినే ఇండియన్-2 కూడా ఇస్తుంది. తొలి భాగంలో స్వాతంత్ర్యానికి పూర్వం ఏం జరిగిందో చూపించాడు శంకర్. కొత్త చిత్రంలో స్వాతంత్ర్యానంతరం ఏం జరిగింది.. అప్పట్లో సేనాపతికి ఎదురైన సమస్యలు ఏంటి.. వాటిపై అతనెలా పోరాటం చేశాడు అన్నది చూపించబోతున్నారు. ‘ఇండియన్’లో తండ్రీ కొడుకుల మధ్య సంఘర్షణను ఆవిష్కరించారు. రెండో భాగంలో సేనాపతి తండ్రిని చూస్తాం. ఈ రెండు పాత్రలకూ కమల్ హాసనే చేశారు’’ అని జయమోహన్ తెలిపారు.

ఈ సినిమా కోసం కమల్ పడుతున్న కష్టం గురించి వివరిస్తూ..‘‘మేకప్ వేసుకున్న తర్వాత ప్యాకప్ చెప్పే వరకు ఆయన ఏమీ తినడానికి వీల్లేదు. ఏదైనా తినడానికి ప్రయత్నిస్తే ప్రోస్థెటిక్ మేకప్ పాడవుతుంది. అందువల్ల షూటింగ్ టైంలో ద్రవాహారం మాత్రమే తీసుకుంటున్నారు. ఆయన్ని చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది’’ అని జయమోహన్ అన్నారు.