రెడ్డి.. అంత సేపు కుర్చోపెడతావా

సంక్రాంతి సినిమాల సందడికి ఇంకో నెల రోజులు కూడా సమయం లేదు. ఇంకో నాలుగు వారాలు తిరిగేసరికి బొమ్మ పడిపోతుంది. సంక్రాంతికి షెడ్యూల్ అయిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు చివరి దశ షూటింగ్‌లో ఉన్నాయి. టాకీ పార్ట్ రెంటికీ దాదాపు పూర్తయినట్లే. రెండు చిత్రాలూ ఇప్పుడు మిగిలి ఉన్న పాటల చిత్రీకరణ మీద దృష్టిపెట్టాయి.

ఐతే ‘వీరసింహారెడ్డి’ టీమే కొంచెం ముందుగా గుమ్మడి కాయ కొట్టేట్లు కనిపిస్తోది. పండక్కి ముందుగా రాబోయే సినిమా అదేనన్న సంగతి తెలిసిందే. దీంతో ఫస్ట్ కాపీ కూడా త్వరగా తీయాలని, చివర్లో హడావుడి ఉండకూడదని చిత్ర బృందం భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీని రెడీ చేసేసినట్లు తెలుస్తోంది. టాకీ పార్ట్‌కు సంబంధించి ఎడిటింగ్ అంతా కూడా పూర్తి చేసేశారట. ఫారిన్లో తీస్తున్న పాటలకు సంబంధించి ఔట్ పుట్ రాగానే ఎడిటింగ్ పూర్తి చేసి ఫస్ట్ కాపీకి కలపడం మాత్రమే మిగిలి ఉంది.

ఆ పాటల రన్ టైం తెలిసిందే కాబట్టి.. టాకీ పార్ట్‌ను కలిపితే ఫైనల్ రన్ టైం ఎంత అన్నది కూడా తేలిపోయినట్లు సమాచారం. సినిమా నిడివి కొంచెం ఎక్కువే వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ‘వీరసింహారెడ్డి’ రన్ టైం 2 గంటల 43 నిమిషాలట. అంటే సినిమా కొంచెం పెద్దదనే చెప్పాలి. ప్రస్తుతం చాలా వరకు సినిమా రెండున్నర గంటలు అంతకంటే తక్కువ నిడివితోనే రిలీజవుతున్నాయి. కానీ బాలయ్య సినిమాలు ఎప్పుడూ కొంచెం పెద్ద నిడివితోనే ఉంటాయి. ఆయన చివరి సినిమా ‘అఖండ’ సైతం 2.45 గంటల నిడివితో రిలీజైంది. ఆ ట్రెండును కొనసాగిస్తూ ‘వీరసింహారెడ్డి’కి కూడా ఎక్కువ రన్ టైం పెట్టినట్లున్నారు.

బాలయ్య సరసన శ్రుతి హాసన్, హనీ రాజ్ నటించిన ‘వీరసింహారెడ్డి’లో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్ర పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.