అవతార్ 2 జాక్ పాట్ కొట్టేసింది

ఇంకో మూడంటే మూడే రోజుల్లో ప్రపంచవ్యాప్త సినిమా ప్రేమికులు ఎదురు చూస్తున్న అవతార్ 2 ది వే అఫ్ వాటర్ విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ వేగంగానే జరుగుతున్నాయి. క్షణాల్లో సోల్డ్ అవుట్స్ కాదు కానీ రిలీజ్ రోజు దాదాపు అన్నీ హౌస్ ఫుల్స్ పడటంలో మాత్రం ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అనుకోకుండా జరిగిందో లేక డిస్నీ అలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఎవరూ ధైర్యం చేయలేకపోయారేమో కానీ అవతార్ 2కి రిలీజ్ టైమింగ్ మాములుగా కలిసి రావడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే మెగా జాక్ పాట్ కొట్టేసిందని ట్రేడ్ అంటోంది.

ఎందుకంటే బాక్సాఫీస్ చప్పగా నడుస్తోంది. చాలా నీరసంగా ఉంది. మొన్న అన్ని సినిమాలు వచ్చినా దేనికీ కనీస వసూళ్లు లేవు. ఏదో వీకెండ్ సోసో అనుకుంటే సోమవారం నుంచి పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉంది. ఉన్నంతలో హిట్ 2, మసూదలు చూసేందుకే ఆడియన్స్ ఇష్టపడుతున్నారు కానీ కొత్త కంటెంట్ ఏదీ కనీస స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక బాలీవుడ్ లోనూ ఇదే తరహా డ్రై పీరియడ్ ఉంది. దృశ్యం 2 బ్లాక్ బస్టర్ అయినా అది వచ్చి నెలవుతోంది. మెయిన్ సెంటర్స్ మినహాయించి చాలా చోట్ల స్లో అయిపోయింది. ఫీడింగ్ కి సినిమాలు లేక షారుఖ్ పాత హిట్లు వేసే పరిస్థితి

సో అన్నిరకాలుగా అవతార్ 2కి ఇండియాలో గ్రాండ్ వెల్కమ్ దక్కనుంది. తిరుపతి లాంటి పట్టణాల్లో ఏకంగా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ రేంజ్ లో థియేటర్లు ఇవ్వడం చూసి జనాలు నివ్వెరబోతున్నారు. ఆపై వారం ధమాకా, 18 పేజెస్ వచ్చేదాకా నిక్షేపంగా అవతార్ 2దే సోలో రాజ్యం అవుతుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం ప్రత్యేకంగా అవసరాల శ్రీనివాస్ తో సంభాషణలు రాయించడం మరో ఆకర్షణ. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు వసూళ్ల వర్షం కురవడం ఖాయమే. పెద్ద స్క్రీన్లున్న మల్టీప్లెక్సుల టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. త్రీడి వెర్షన్ చూసేందుకే అధిక శాతం మొగ్గుచూపుతున్నారని బుకింగ్స్ తేటతెల్లం చేస్తున్నాయి.