సురేష్ బాబు రెండోవైపు ఆలోచించలేదే

వారసుడు థియేటర్ల వివాదంలో విమర్శలు ఎదుర్కుంటున్న దిల్ రాజుకు మద్దతుగా నిన్న నిర్మాత సురేష్ బాబు చేసిన కామెంట్స్ పలు కోణాల్లో చర్చకు దారి తీసింది. వాళ్ళకు పెద్ద రిలీజ్ ఇవ్వడంలో తప్పేమీ లేదని, ఆర్ఆర్ఆర్ పుష్పలను అక్కడ స్వాగతించినప్పుడు మనమూ అలాగే చేయాలనే లాజిక్ తో సమర్ధించే ప్రయత్నం చేశారు. ఒక కోణంలోనే చూస్తే ఇది ముమ్మాటికి కరెక్ట్. కానీ నాణేనికి రెండు వైపులా ఉన్నట్టు మరో యాంగిల్ ని మిస్ చేయకూడదు. ఆయన వెర్షన్ ప్రకారం తమిళనాడులో ప్యాన్ ఇండియాలు ఆదరిస్తున్నారు కాబట్టి టాలీవుడ్ లో డబ్బింగుల మీద బెట్టు చేయకూడదనేది ప్రధానమైన పాయింట్.

కానీ వారసుడు విజువల్ గ్రాండియర్ కాదు. భారీ బడ్జెట్ తో తీసిన రెగ్యులర్ కమర్షియల్ సినిమా. దీన్ని ట్రిపులార్ లాంటి వాటితో పోల్చడం కరెక్ట్ కాదు. మరి దసరాకు గాడ్ ఫాదర్ రిలీజ్ చేసినప్పుడు పొన్నియన్ సెల్వన్ 1 ఆడుతున్న కారణంగా థియేటర్లు ఇవ్వలేమని తమిళ బయ్యర్లు తేల్చి చెబితే విధి లేక డబ్బింగ్ వెర్షన్ ని ఆలస్యంగా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. చిరంజీవి వద్దులే నయనతార సల్మాన్ ఖాన్ లాంటి భారీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఎందుకు అంగీకరించలేదు. మనం వారసుడుని స్వంతం చేసుకుందాం. మరి వాళ్ళు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు స్వాగతం చెబుతారా. అసాధ్యమని అందరికీ తెలుసు.

పైపెచ్చు లింగుస్వామిలాంటి వాళ్ళు ఏకంగా మీడియా ముందు బెదిరింపుకు దిగిన దాఖలాలున్నాయి. ఇంత రాద్ధాంతం చేస్తుంటే సింపుల్ గా మనం వారసుడుకి రూట్ క్లియర్ చేయాలి, వాళ్ళు మాత్రం మన సినిమాలకు బెట్టు చేయాలి అంటే అదేం న్యాయం. చెన్నైకి హైదరాబాద్ ఎంత దూరమో హైదరాబాద్ కు చెన్నై అంతే దూరం. మారదు కదా. సురేష్ బాబు దీని గురించి కూడా కాస్త వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. అక్కడ హాజరైన మీడియా సైతం ఇది అడగలేకపోయింది. నారప్ప రీ రిలీజ్ గురించి ఉద్దేశించిన ప్రెస్ మీట్ లో దానికి సంబంధం లేని ఇలాంటి అంశాలు హాట్ టాపిక్ గా మారడం గమనార్హం.