కంగ‌నాకు సౌత్ మోజు తీర‌లేదే..


బాలీవుడ్లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఎదిగిన కంగ‌నా ర‌నౌత్‌.. ద‌క్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో న‌టించింది. బాలీవుడ్లో ఇంకా అంత‌గా నిల‌దొక్కుకోని స‌మ‌యంలోనే ఆమె త‌మిళంలో ధూమ్ ధామ్, తెలుగులో ఏక్ నిరంజ‌న్ చిత్రాల్లో న‌టించింది. ఆ రెండూ ఆమెకు తీవ్ర నిరాశ‌నే మిగిల్చాయి.

ఐతే చాలా ఏళ్ల గ్యాప్ త‌ర్వాత‌, తాను బాలీవుడ్లో పెద్ద స్టార్‌గా ఎదిగాక‌.. జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో న‌టించింది కంగ‌నా. త‌లైవి పేరుతో ఎ.ఎల్‌.విజ‌య్ రూపొందించిన ఈ సినిమా సైతం కంగ‌నాకు చేదు అనుభ‌వ‌మే మిగిల్చింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ చిత్రం పెద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ద‌క్షిణాదిన కంగ‌నాకు అస్స‌లు కంగ‌నాకు అస్స‌లు క‌లిసి రాక‌పోవ‌డంతో ఇక మ‌ళ్లీ ఆమె ఇటు వైపు చూడ‌ద‌నే అనుకున్నారంతా. కానీ ఆమెకు మాత్రం సౌత్ మీద మోజు పోయిన‌ట్లు లేదు. ఓ పెద్ద సినిమాలో కీల‌క పాత్ర చేయ‌బోతోంది.

లారెన్స్ క‌థానాయ‌కుడిగా సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు పి.వాసు రూపొందిస్తున్న చంద్ర‌ముఖి-2లో లీడ్ హీరోయిన్ పాత్ర‌కు కంగ‌నా ర‌నౌత్ ఎంపిక కావ‌డం విశేషం. ఆమె ఇలాంటి సినిమాలో న‌టిస్తుంద‌ని ఎవ‌రూ అనుకోరు. నిజానికి ఈ చిత్రంలో క‌థానాయిక పాత్ర‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను అనుకున్నారు. కానీ ఆమె పెళ్లి చేసుకుని బిడ్డ‌కు త‌ల్లి కావ‌డంతో ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంది. త‌ర్వాత హీరోయిన్ పాత్ర‌కు ర‌క‌ర‌కాల పేర్లు వినిపించాయి కానీ.. వాళ్లెవ్వ‌రూ ఖ‌రారు కాలేదు.

ఐతే చివ‌రికి కంగ‌నా ర‌నౌత్‌ను ఈ పాత్ర‌కు ఓకే చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆల్రెడీ చంద్ర‌ముఖికి సీక్వెల్‌గా క‌న్న‌డ‌లో, తెలుగులో సినిమాలు తీశాడు పి.వాసు. ఐతే త‌మిళంలో తీయ‌బోయే సీక్వెల్ భిన్న‌మైంద‌ని తెలుస్తోంది. ర‌జినీకాంత్ వీరాభిమాని అయిన లారెన్స్ ఆయ‌న పాత్ర‌ను కొన‌సాగించ‌బోతున్నాడు. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.