హిర‌ణ్య క‌శ్య‌ప‌.. గుణ‌శేఖ‌ర్ ఔట్‌


హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి చ‌ర్చ‌ల్లో ఉన్న సినిమా. ‘రుద్రమదేవి’ లాంటి సాహసోపేత సినిమా తీసిన గుణశేఖర్.. దాని తర్వాత ‘హిరణ్య కశ్యప’ను అంతకుమించినయ భారీ త‌నంతో తీయాల‌నుకున్నాడు. ఈసారి సొంత ప్రొడ‌క్ష‌న్లో కాకుండా సురేష్ బాబు నిర్మాణంలో సినిమా చేయ‌డానికి గుణ‌శేఖ‌ర్ రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండేళ్లు గుణ‌శేఖ‌ర్, సురేష్ బాబు ఈ ప్రాజెక్టు కోసం క‌లిసి ప్ర‌యాణం సాగించారు.

రూ.200 కోట్ల ఖ‌ర్చుతో రానా హీరోగా ఈ సినిమా తీయ‌డానికి సురేష్ బాబు ఒక టైంలో సీరియ‌స్‌గానే రంగంలోకి దిగాడు. గుణ‌శేఖ‌ర్ కొన్నేళ్ల పాటు ఈ క‌థ రీసెర్చ్, స్క్రిప్టు ప‌నిలో నిమ‌గ్నం అయ్యాడు. కానీ త‌ర్వాత ఏమైందో ఏమో.. ఈ ప్రాజెక్టు ప‌క్క‌కు వెళ్లిపోయింది. గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం మీదికి వెళ్లిపోయాడు. బ‌హుశా కొన్నేళ్లుగా లో బ‌డ్జెట్ సినిమాల‌కే ప‌రిమితం అవుతున్న సురేష్ బాబు.. అంత బ‌డ్జెట్ పెట్టి రిస్క్ చేయ‌లేక వెన‌క్కి త‌గ్గి ఉంటార‌ని అంతా అనుకున్నారు.

కానీ సురేష్ బాబు ఇప్పుడు అంద‌రికీ పెద్ద షాకే ఇచ్చారు. హిర‌ణ్య క‌శ్య‌ప సినిమా త‌మ ప్రొడ‌క్ష‌న్లోనే తెర‌కెక్కుతుంద‌ని.. కానీ ద‌ర్శ‌కుడు వేరు అని ఆయ‌న వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. హిర‌ణ్య క‌శ్య‌ప‌కు మారితే నిర్మాత మారుతాడేమో.. ద‌ర్శ‌కుడిగా గుణ‌శేఖ‌రే ఉంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కోసం అంత క‌ష్ట‌ప‌డ్డాడు గుణ‌. రుద్ర‌మ‌దేవి తీసిన అనుభ‌వంతో ఈ చిత్రానికి బాగానే తెర‌కెక్కించ‌గ‌ల‌డ‌ని కూడా అనుకున్నారు.

అస‌లు ఈ సినిమా ఆలోచ‌న చేసింది, స్క్రిప్టు రెడీ చేసిందే గుణ‌. త‌ర్వాత సురేష్ ప్రొడ‌క్ష‌న్ సీన్లోకి వ‌చ్చింది. అలాంటిది అత‌ను కాకుండా వేరే ద‌ర్శ‌కుడితో ఈ సినిమా చేస్తామ‌ని సురేష్ బాబు ప్ర‌క‌టించ‌డం ఎవ‌రికీ మింగుడుప‌డ‌డం లేదు. శాకుంత‌లంను హిట్ చేసి గుణ ఈ ప్రాజెక్టును మొద‌లుపెడ‌తాడ‌నుకుంటే.. ఇప్పుడు ఇది పెద్ద ట్విస్టే. దీనిపై గుణ ఎలా స్పందిస్తాడో చూడాలి.