నేను సుశాంత్ గర్ల్ ఫ్రెండ్.. సీబీఐ ఎంక్వైరీ వేయండి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తుల్లో రియా చక్రవర్తి ఒకరు. ఈ అమ్మాయి సుశాంత్ ప్రేయసి కావడం గమనార్హం. ఆమెను మరి కొన్ని నెలల్లో సుశాంత్ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతోనూ ఉన్నాడట. కానీ ఏం జరిగిందో ఏమో.. ఇప్పుడిలా అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడు.

సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటానికి రియా కూడా ఓ కారణం అంటూ ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మొన్న సుశాంత్ చనిపోయి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో అతడితో సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలు పెట్టి ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది రియా. ఐతే అందులో ఆమె బాధను పట్టించుకోకుండా సుశాంత్ మరణానికి కారణమై ఇప్పుడు డ్రామాలాడుతున్నావా అంటూ నెటిజన్లు ఆమెను తిట్టిపోశారు.

ఐతే రియా అవేమీ పట్టించుకోకుండా తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ ఓ సంచలన ట్వీట్ వేసింది. తాను సుశాంత్ ప్రేయసినని చెబుతూ.. అతను చనిపోయి నెల రోజులు అవుతోందని.. ప్రభుత్వం మీద తనకు పూర్తి విశ్వాసం ఉందని.. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడేంత ఒత్తిడికి గురి కావడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు సీబీఐ విచారణ జరిపించాలని కోరింది రియా.

ఐతే రియా, మహేష్ భట్, మరికొందరు బాలీవుడ్ బడా బాబులే సుశాంత్ మృతికి కారణమని.. అలాంటిది రియానే సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరడం హాస్పాస్పదమని.. అయినా సుశాంత్ చనిపోయిన నెల రోజుల తర్వాత తీరిగ్గా ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం ఏంటని.. ఈ పని అతను చనిపోయిన వెంటనే ఎందుకు చేయలేదని రియాను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మొత్తంగా రియా ఏం చేసినా తప్పే అన్నట్లుగా ఉంది వ్యవహారం.