మహేష్ 28.. ఖర్చు తడిసి మోపెడు

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం రకరకాల కారణాల వల్ల అనుకున్నదానికంటే చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. అసలు సెట్స్ మీదికి వెళ్లడంలోనే దాదాపు ఆరు నెలల జాప్యం జరిగింది. కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడానికి తోడు మహేష్ వ్యక్తిగత జీవితంలో తలెత్తిన విషాదాల వల్ల సినిమా ముందుకు కదల్లేదు.

ఇంతకుముందే ఒక స్క్రిప్టును ఓకే చేసి షూటింగ్ కూడా మొదలుపెట్టి ఒక షెడ్యూల్లో ఒక యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తి చేసింది చిత్ర బృందం. కానీ ఆ తర్వాత కథ పూర్తిగా మార్చేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో అప్పటికే షూట్ చేసిందంతా డస్ట్ బిన్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు వేరే కథతో కొత్తగా ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. ఇంతకుముందు త్రివిక్రమ్ సిద్ధం చేసింది ఫుల్ లెంగ్త్ యాక్షన్ స్క్రిప్టు. దాని శైలికి తగ్గట్లే ఇంతకుముందు మ్యూజిక్ సిట్టింగ్స్ చేసి ట్యూన్లు ఓకే చేశారు. అందుకోసం మహేష్, త్రివిక్రమ్‌లతో పాటు తమన్ దుబాయికి వెళ్లారు. అక్కడే సిట్టంగ్స్ జరిగాయి.

కాగా ఇప్పుడు స్క్రిప్టు మారింది. సంగీతం కూడా మార్చక తప్పట్లేదు. దీంతో మరోసారి టీంలోని ముఖ్య స‌భ్యులంతా దుబాయ్‌లో సిట్టింగ్స్ వేయడానికి రెడీ అయ్యారు. మహేష్, త్రివిక్రమ్, తమన్‌‌లతో నిర్మాత నాగవంశీ కూడా అందులో పాల్గొంటున్నారు. అందరికీ వేర్వేరుగా హోటళ్లలో రూమ్స్ బుక్ చేశారు. దీనికి బాగానే ఖర్చవుతోంది. ఇప్పటిదాకా జరిగిన స్టోరీ సిట్టింగ్స్, ప్రి ప్రొడక్షన్ వర్క్, వేస్టయిన ఆర్టిస్టుల కాల్ షీట్స్, కొన్ని రోజులు జరిగిన షూటింగ్, సంగీత చర్చలు.. అన్నింటికీ కలిపి కోట్లల్లోనే ఖర్చయింది. మొత్తంగా చూస్తే అసలు సెట్స్ మీదికి వెళ్లకుండానే ఖర్చు తడిసి మోపెడైందని యూనిట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ సినిమాకు ఇటు మహేష్ బాబు, అటు త్రివిక్రమ్ రికార్డు స్థాయిలో పారితోషకం తీసుకోబోతున్నారు. త్రివిక్రమ్ సినిమాలంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కాపీ తీసేసరికి బడ్జెట్ ఏ స్థాయికి చేరుతుందో అని నిర్మాతలు టెన్షన్ పడుతుంటే ఆశ్చర్యం లేదు.