నాగార్జునకు నమ్మకం పోయిందా?

టాలీవుడ్లో ఎందరో కొత్త దర్శకులకు అవకాశమిచ్చి.. ఎన్నో కొత్త కథలు, ప్రయోగాత్మక చిత్రాలు చేసిన హీరో అక్కినేని నాగార్జున. ఒకప్పుడు టాలీవుడ్ టాప్-4 హీరోల్లో ఒకడిగా వైభవం చూసిన ఆయన.. గత కొన్నేళ్ల నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత ఆయన కోరుకున్న స్థాయిలో ఏ సినిమా విజయం సాధించలేదు. అందులోనూ ఈ మధ్య అయితే వరుసగా డిజాస్టర్లు ఎదురవుతున్నాయి. నాగ్ సినిమాలు కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోతున్నాయి.

గత ఏడాది ‘వైల్డ్ డాగ్’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా ఫ్లాప్ కాగా.. ఈ ఏడాది ‘ఘోస్ట్’ నెగెటివ్‌ టాక్‌తో చతికిలపడింది. దీంతో ఇప్పటి ప్రేక్షకులు నాగ్‌తో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. నాగ్ ఫ్యాన్స్ సైతం ఆయన సినిమాలు చూడడానికి ముందుకొస్తున్నట్లుగా కనిపించడం లేదు.

ఇప్పుడు తాను ఎలాంటి కథలు చేయాలో తెలియని అయోమయంలో నాగ్ పడిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ఇంతకుముందులా కథలను జడ్జ్ చేయలేకపోతున్నారన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త కథలను నమ్ముకోవడం కంటే ఆల్రెడీ వేరే భాషలో హిట్టయిన సినిమాలను రీమేక్ చేయడం మంచిదనే నిర్ణయానికి నాగ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన మలయాళంలో హిట్టయిన ‘పోరింజు మరియం జోస్’ అనే చిత్ర రీమేక్‌లో నటించబోతున్నాడంటున్నారు. ఈ చిత్రంతో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా పరిచయం కానున్నాడట.

సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే లాంటి హిట్లతో రచయితగా ప్రసన్నకు మంచి పేరే వచ్చింది. త్వరలో రానున్న ‘ధమాకా’కు కూడా అతనే రైటర్. కామెడీ బాగా రాస్తాడని పేరున్న ప్రసన్న.. మంచి ఎంటర్టైనర్‌గా పేరు తెచ్చుకున్న ‘పోరింజు మరియం జోస్’ను ఎంచుకుని నాగ్ ఇమేజ్‌కు, మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చాడని.. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్తుందని అంటున్నారు. మరి ఈ చిత్రమైనా నాగ్‌కు మళ్లీ మంచి రోజులను తీసుకొస్తుందేమో చూడాలి.