బాస్ పార్టీ.. మిక్స్డ్ రెస్పాన్స్

మెగాస్టార్ చిరంజీవి ఈ మద్య సోషల్ మీడియాలో ఎక్కువగా వ్యతిరేకతనే ఎదుర్కొంటున్నారు. ‘ఆచార్య’ సినిమా నుంచి ఈ ఒరవడి పెరిగింది. ఆ సినిమా విడుదలకు ముందే వ్యతిరేకత ఎదుర్కొంది. ఇక రిలీజ్ తర్వాత ట్రోలింగ్ ఏ స్థాయిలో జరిగిందో తెలిసిందే. రీమేక్ మూవీ కావడం, ప్రోమోలు ఆకర్షణీయంగా లేకపోవడం వల్ల ‘గాడ్ ఫాదర్’కు సైతం వ్యతిరేకత తప్పలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

ఇప్పుడిక ‘వాల్తేరు వీరయ్య’ వంతు వచ్చింది. ఈ సినిమా నుంచి తాజాగా ‘బాస్ పార్టీ’ అనే పాటను అనౌన్స్ చేశారు. ముందుగా దీని టీజర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాదే ఇంట్రో ఇచ్చారు. నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్టు ముడేస్కో, నువ్వు కర్చీఫ్ కట్టుకో బాస్ ఒస్తుండు బాస్ ఒస్తుండు.. నువ్వు లైట్లేస్కో, నువ్వు కలర్ మార్చుకో, నువ్వు సౌండ్ పెంచుకో బాసొస్తుండు బాసొస్తుండు.. అంటూ సాగింది ఈ పాట.

ఐతే దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ ఏమంత ఆకర్షణీయంగా లేకపోవడం.. పాటలో ఫ్లో లేకపోవడం.. లిరిక్స్ మరీ రొటీన్‌గా అనిపించడంతో జనాల నుంచి పాట విషయంలో ఎక్కువగా నెగెటివ్ రెస్పాన్సే వస్తోంది. ఒకప్పట్లా పాటల్లో కొత్తదనం చూపించ లేక ఈ మధ్య బాగా విమర్శలు ఎదుర్కొంటున్న దేవికి మరోసారి నెటిజన్ల నుంచి కౌంటర్లు తప్పట్లేదు. ఇంకా ఎన్నాళ్లు ఇవే పాటలు ఇస్తావ్ అని విమర్శిస్తున్నారు. ఈ పాటకు లిరిక్స్ రాసింది కూడా దేవినే కావడం గమనార్హం. నకాష్ అజీజ్, నిహారికలతో కలిసి తనే ఈ పాటను ఆలపించాడు.

ఐతే మెగా ఫ్యాన్స్ మాత్రం చిన్న టీజర్ చూసి ఈ పాట మీద ఒక అంచనాకు వచ్చేయొద్దని అంటున్నారు. ఇంతకుముందు ‘ఊ అంటావా’ పాట విషయంలోనూ ముందు నెగెటివ్‌గానే స్పందించారని.. తర్వాత అదే ట్రెండ్ సెట్టర్ అయిందని.. ‘బాస్ పార్టీ’ కూడా అలాగే పెద్ద హిట్టవుతుందని వాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.