దిల్ రాజుకు మద్దతుగా అశ్వినీదత్ స్ట్రాంగ్ స్టేట్మెంట్

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి రెండు భారీ చిత్రాలు పోటీలో ఉండగా.. వాటికి దీటుగా తాను నిర్మిస్తున్న తమిళ చిత్రానికి అనువాదమైన ‘వారసుడు’కు దిల్ రాజు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు బుక్ చేస్తుండడంపై కొన్ని రోజులుగా పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయమై నిర్మాతల మండలి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, పండుగలప్పుడు తెలుగు చిత్రాలకే ప్రాధాన్యం ఉంటుందంటూ గతంలో రాజు ఇచ్చిన స్టేట్మెంట్‌ను ఉటంకిస్తూ ఆయన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఈ వివాదం, నిర్మాతల మండలి ఇచ్చిన స్టేట్మెంట్‌పై అగ్ర నిర్మాత అశ్వినీదత్ ఆసక్తికర రీతిలో స్పందించారు. నిర్మాతల మండలి స్టేట్మెంట్‌ను ఆయన ఖండించారు. దిల్ రాజుకు మద్దతుగా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

“నిర్మాతల మండలి ఇచ్చిన స్టేట్మెంట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. వారి ప్రకటనను నేను ఖండిస్తున్నా. మన సినిమాలకు మన దగ్గర ఎలా ఆడుతున్నా సరే. చాలా వరకు డబ్బింగ్ మార్కెట్, ఓటీటీల వల్లే గట్టెక్కుతున్నాయి. తమిళంలో మన సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని ఎలా చెబుతారు? ఇది ఆత్మహత్యా సదృశ్యమే. ఒక తెలుగు నిర్మాత, ఒక తెలుగు దర్శకుడు కలిసి సినిమా చేశారు. దాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసుకుంటే తప్పేముంది? ఇదే సంక్రాంతికి మరో నిర్మాత తమ ప్రొడక్షన్లో తెరకెక్కిన రెండు చిత్రాలను ఒకేసారి రిలీజ్ చేసుకోవచ్చా? థియేటర్ల సమస్య ఎదురవుతోందంటే ఆ నిర్మాత తన సినిమాల్లో ఒకదాన్ని ఆపుకోవచ్చు కదా?” అని అశ్వినీదత్ ప్రశ్నించారు.

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు రెండూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనే తెరకెక్కిన సంగతి తెలిసిందే. దాన్ని ఉటంకిస్తూనే ఒకే నిర్మాత తన సినిమాలు రెంటిని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నపుడు.. దిల్ రాజు ‘వారసుడు’ను పండక్కి విడుదల చేయడంలో తప్పేముందని లా పాయింట్ తీశారు దత్.