కాంతారావు కుటుంబం.. ఇంత దయనీయమా?

రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సూపర్ స్టార్ కృష్ణ గురించే చర్చ. ఆయన హఠాన్మరణంతో అందరూ తన గొప్పదనం, ఘనతల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయనకు తెలుగు ప్రజలు ఘన నివాళి అర్పించారు. ఐతే ఇదే సందర్భంలో తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ మరో లెజెండరీ నటుడి కుటుంబం దయనీయ స్థితికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ నటుడు ఎవరో కాదు.. జానపద, పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్‌కు దీటుగా నిలిచిన కాంతారావు. కత్తి యుద్ధాలతో కూడిన సన్నివేశాల్లో తనకు తానే సాటి అన్నట్లుగా చెలరేగిపోయే కాంతారావుకు కత్తి కాంతారావు అని పేరుంది. అప్పట్లో ఆయన ఎన్నో ఘనవిజయాలు అందుకున్నారు. తెలుగు పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకున్న నటుల్లో ఒకడిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి చనిపోయే నాటికి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి తలెత్తింది.

కాంతారావు చిత్ర పఠం ముందు చేతులు జోడించి కూర్చున్న ఆయన ఇద్దరు కొడుకుల ఆహార్యం చూస్తే.. వారి కుటుంబం ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థమవుతుంది. ఒకప్పుడు మద్రాసులో కాంతారావు ఉన్న బంగ్లాలో ఇప్పుడు తాము అద్దెకు ఉంటున్నామని, తెలంగాణ బిడ్డ అయిన కాంతారావు ఆస్తులు అమ్ముకుని సినిమాలు చేసి దెబ్బ తిన్నారని.. తమకు ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిన అవసరమున్న మాట వాస్తవమే కానీ.. సామాన్యులకు వంద రూపాయల ఆదాయం కూడా చాలా గొప్పదిగా భావించే రోజుల్లో ఒక్కో సినిమాకు వేల రూపాయల పారితోషకం అందుకుని వైభవం చూసిన నటుల్లో కాంతారావు ఒకరు.

ఆ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నా ఈ రోజు వందల కోట్ల ఆస్తులకు ఆయన వారసులు అధిపతులుగా ఉండేవాళ్లు. ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా కాంతారావు సమకాలీన నటుల్లో చాలామంది కుటుంబాల పరిస్థితి ఏంటో ఇప్పుడు చూడొచ్చు. సినిమాల్లో నష్టపోయారో, ఇంకేం చేశారో కానీ.. చివరి రోజుల్లో దయనీయ స్థితికి చేరారన్నా, ఇప్పుడాయన కుటుంబం ఇబ్బంది పడుతోందన్నా అందుకు కాంతారావుదే బాధ్యత అని చెప్పాలి.