ప్రకాష్ రాజే డైరెక్ట్ చేద్దామనుకుని..

రంగమార్తాండ.. ఒకప్పటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన కృష్ణవంశీ నుంచి రాబోతున్న కొత్త చిత్రం. ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు తీస్తూ.. తరచుగా ఘనవిజయాలు అందుకున్న కృష్ణవంశీ గత దశాబ్ద కాలంలో బాగా డల్లయిపోయాడు. చందమామ తర్వాత ఆయన్నుంచి హిట్టే రాలేదు. మొగుడు, నక్షత్రం లాంటి డిజాస్టర్లు ఆయన స్థాయిని బాగా తగ్గించేశాయి.

నక్షత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆయన రంగమార్తాండ సినిమా చేస్తున్నారు. ఐతే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి చాలా కాలం అయింది. కానీ ఎంతకీ పూర్తవడం లేదు. ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఐతే ఇటీవలే ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లాంటి వాళ్లు ఈ సినిమా కోసం డబ్బింగ్ చెబుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి.

అంటే త్వరలోనే సినిమా థియేటర్లలోకి దిగే అవకాశం ఉందన్నమాట. ఈ దిశగా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో ‘రంగమార్తాండ’ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. మరాఠీ హిట్ ‘నటసామ్రాట్’కు రీమేక్‌‌గా తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ సినిమాను ముందు తనే డైరెక్ట్ చేయాలనుకున్నానని.. కానీ ఈ సినిమా తీయడానికి తన మిత్రుడైన కృష్ణవంశీనే సరైన వాడని భావించి అతడికి చేతికి ఈ సినిమాను అప్పగించానని ప్రకాష్ రాజ్ తెలిపాడు.

‘రంగమార్తాండ’ తన కెరీర్లోనే ది బెస్ట్ ఫిలింగా నిలుస్తుందని.. ఇప్పటిదాకా చూడని కొత్త ప్రకాష్ రాజ్‌ను ఈ సినిమాలో చూస్తారని ప్రకాష్ రాజ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రకాష్ రాజ్ ఇంతగా చెబుతున్నాడంటే ఆయన పాత్ర ప్రత్యేకంగానే ఉంటుందని ఆశించవచ్చు. ఒరిజినల్లో లెజెండరీ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ చేసిన పాత్రనే ఇక్కడ ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు.