కత్రినా జాన్వీ ఇద్దరికీ షాకే

నిన్న బాలీవుడ్ లో రెండు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. అందులో మొదటిది ఫోన్ భూత్. కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో ఇషాన్ కట్టర్, సిద్దార్థ్ చతుర్వేది, షీబా చద్దా ఇతర క్యారెక్టర్స్ లో నటించారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో హారర్ కామెడీ జానర్ లో రూపొందించారు. విక్కీ కౌశల్ తో పెళ్ళయాక కత్రినా ఫుల్ లెన్త్ లో నటించి రిలీజ్ చేసిన మూవీ ఇదే. అయితే కనీస ఓపెనింగ్స్ నోచుకోక ఈ ఫోన్ భూత్ నుంచి అన్నీ రాంగ్ నెంబర్లు వెళ్తున్నాయని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. అటు రివ్యూలు కానీ ఇటు పబ్లిక్ టాక్ కానీ ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదని నిర్మాతలు బెంగపెట్టుకున్నారు.

కత్రినా ఇమేజ్ దీనికి ఏ మాత్రం పని చేయలేదు. పైగా కంటెంట్ కూడా సోసోగా ఉండటంతో అటు నవ్వలేక ఇటు భయపడలేక మధ్యలో చుక్కలు చూస్తున్నారు ఆడియన్స్. ఇక జాన్వీ కపూర్ మిలి విషయానికి వస్తే మలయాళం సూపర్ హిట్ హెలెన్ కి రీమేక్ గా రూపొందిన ఈ సర్వైవర్ థ్రిల్లర్ ఒరిజినల్ వెర్షన్ ని మక్కికి మక్కి ఫాలో అయిపోయింది. ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా తీశారు. తెలుగు డబ్బింగ్ లేకపోయినా హైదరాబాద్ వచ్చి మరీ జాన్వీ మిలి ప్రమోషన్లలో పాల్గొంది. అయితే ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి కానీ ఇది థియేటర్ కంటెంట్ కాదన్న అభిప్రాయం నెగటివ్ గా వెళ్తోంది.

ఒరిజినల్ చూడనివాళ్లకు మాత్రమే మిలి అంతో ఇంతో కనెక్ట్ అవుతుంది కానీ అన్నా బెన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హెలెన్ చూసి ఉంటే మాత్రం దీని జోలికి వెళ్ళకపోవడం మంచిది. డీప్ ఫ్రీజర్ రూమ్ లో ఒక రాత్రంతా చిక్కుకుపోయిన అమ్మాయి పడే నరకయాతనను ఏసీ హాలులో రెండు గంటల పాటు చూడటం ప్రేక్షకులు భారంగా ఫీలవుతున్నారు. ఇలాంటివి ఓటిటిలో ఎంజాయ్ చేయగలం కానీ ఇలా బిగ్ స్క్రీన్ మీద కాదని మొహం మీదే చెప్పేస్తున్నారు. కాకపోతే ఫోన్ భూత్ కంటే కొంత నయమనే మాట వచ్చింది. మొత్తానికి సీనియర్ కత్రినా జూనియర్ జాన్వీ ఇద్దరికీ బాక్సాఫీస్ షాక్ తప్పలేదు.