త్రివిక్రముడికి తప్పని గాసిప్పులు

మహేష్ బాబు తో త్రివిక్రమ్ చేస్తున్న SSMB28 నుండి బోలెడన్ని గాసిప్పులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఆరంభం నుండి ఈ సినిమా చుట్టూ వివిధ రకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. నాలుగు రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యుల్ తర్వాత రెండో షెడ్యుల్ కి బాగా గ్యాప్ వచ్చేసింది. మధ్యలో మహేష్ తల్లి చనిపోవడం తెలిసిందే. కానీ తల్లి పెద్ద కర్మ అనంతరం కూడా మహేష్ త్రివిక్రమ్ సినిమాను రీస్టార్ట్ చేయకపోవడం , మధ్యలో ఫారిన్ ట్రిప్ కి వెళ్ళడం అందరికీ ఈ ప్రాజెక్ట్ మీద అనుమానాలు క్రియేట్ అయ్యేలా చేశాయి.

దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఇంక లేనట్టేనని , మహేశ్ త్రివిక్రమ్ వర్క్ మీద అసంతృప్తిగా ఉన్నాడని అందుకే ఉన్నపళంగా రెండో షెడ్యుల్ స్టార్ట్ చేయకుండా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడని అవి ఇవి చేర్చి గాసిప్పులు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ కి చాలా టైం తీసుకున్నారు. ఎనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత చాలా నెలలకి సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఆ మధ్యలో కూడా పలు గాసిప్పులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

తాజాగా ఒక ట్విట్టర్ ఎకౌంట్ లో రెండు పెద్ద సినిమాలు ఆగిపోనున్నాయని ట్వీట్ కనిపించగానే యాంటీ ఫ్యాన్స్ అంతా అందులో ఒకటి మహేష్ -త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అంటూ ట్వీట్స్ వేయడం మొదలు పెట్టారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. వెంటనే నిర్మాత నాగ వంశీ రంగంలోకి దిగి సినిమాకు సంబంధించి రెండో షెడ్యుల్ త్వరలోనే ప్రారంభం కానుందని మరికొన్ని రోజుల్లో ఒక్కో అప్ డేట్ రానుందని చెప్పుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా ‘అల వైకుంఠ పురములో’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రముడి సినిమా మీద ఇలాంటి గాసిప్పులు ఎలా పుడుతున్నాయో అవి పుట్టించే వారికే తెలియాలి.