వంశీ పైడిపల్లిపై తీవ్ర ఒత్తిడి

వంశీ పైడిపల్లి కెరీర్లో దాదాపుగా అన్నీ టాప్ హీరోలతో, పెద్ద బడ్జెట్లో సినిమాలే చేశాడు. తొలి సినిమా ‘మున్నా’ మినహాయిస్తే అతడి సినిమాలన్నీ హిట్లే. కాకపోతే బడ్జెట్ బాగా ఎక్కువ పెట్టించేస్తాడని, మంచి టాక్ వచ్చినా రికవరీ కష్టం అనే విమర్శ అతడి మీద ఉంది. ‘ఊపిరి’ సినిమా చాలా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలవగా.. ‘మహర్షి’ సైతం ఓవర్ బడ్జెట్ సమస్యను ఎదుర్కొంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కొంచెం పరిస్థితులు కలిసొచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బయటపడిపోయారు కానీ.. లేకుంటే కష్టం అయ్యేది.

ఇప్పుడిక వంశీ తమిళ చిత్రం ‘వారిసు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ టాప్ స్టార్ విజయ్ నటించిన ఈ సినిమాను ముందు ద్విభాషా చిత్రంగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడేమో పక్కా తమిళ సినిమాగా చెబుతున్నారు. సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం కూడా కష్టమే కావచ్చు.

ఎందుకంటే ఆ పండక్కి ఆల్రెడీ ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి భారీ చిత్రాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. వాటితో పోటీపడి సత్తా చాటాలంటే ‘వారసుడు’ చాలా స్పెషల్ సినిమా అయ్యుండాలి. ఎలాగూ ఇది డబ్బింగ్ సినిమా అనేశారు కాబట్టి ఆసక్తి తక్కువగానే ఉంటుంది. మరోవైపు తమిళంలో చూస్తే అజిత్ కుమార్ ‘తునివు’ అనే సాలిడ్ మూవీతో దిగుతున్నాడు. ఆల్రెడీ తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన ‘వలిమై’ తీసిన హెచ్.వినోద్ దర్శకత్వంలో అజిత్ చేస్తున్న సినిమా ఇది. దీనిపై భారీ అంచనాలున్నాయి.

అదే సమయంలో విజయ్ చివరి చిత్రం ‘బీస్ట్’ డిజాస్టర్ అయింది. ‘వారసుడు’ మీద తమిళంలో కూడా మరీ అంచనాలేమీ లేవు. వంశీ ఏదో రొటీన్ మూవీ తీస్తున్నాడనే అభిప్రాయంతో ఉన్నారు అక్కడి జనాలు. ఈ సినిమా టైటిల్, మిగతా ప్రోమోలు అదే ఫీల్ కలిగిస్తున్నాయి. ‘మహర్షి’కి ఇది ఇంకో వెర్షన్ అనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు యధావిధిగా వంశీ భారీగానే ఖర్చు పెట్టించేస్తున్నాడట. బడ్జెట్ హద్దులు దాటుతున్నట్లు సమాచారం. ఓవైపు ఇటు తమిళంలో, అటు తెలుగులో పోటీ తీవ్రంగా ఉంది. సినిమా బడ్జెట్ ఏమో ఎక్కువైపోయింది. సినిమాకు రావాల్సినంత హైప్ రాలేదు. ఈ స్థితిలో హిట్ కొట్టడం వంశీకి పెద్ద సవాలే. అతనేం చేస్తాడో చూడాలి.