మారుతికి మూడు రోజులిచ్చిన ప్రభాస్

అభిమానులు ఎంత వద్దన్నా పట్టించుకోకుండా మారుతి దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్ని మొదులపెట్టేశాడు ప్రభాస్. అసలే సాహో, రాధేశ్యామ్‌లతో ప్రభాస్ ట్రాక్ రికార్డు దెబ్బ తినగా.. మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ లాంటి డిజాస్టర్లు తీసిన మారుతితో ఈ టైంలో జట్టు కట్టడం అవసరమా అన్నది వారి ప్రశ్న.

సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి తీవ్రమైన వ్యతిరేకత కనిపించడంతో జడిసిన దర్శక నిర్మాతలు.. ప్రారంభోత్సవం జరిపినపుడు అధికారిక ప్రకటన కూడా చేయలేదు. ఇప్పటిదాకా సినిమా గురించి ఏ రకమైన అఫీషియల్ అప్‌డేట్ లేదు. ఐతే ఇటీవలే చడీచప్పుడు లేకుండా ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైపోయింది. వారం రోజుల పాటు తొలి షెడ్యూల్ సైతం పూర్తి చేసినట్లు సమాచారం.

ఈ వారం రోజుల్లో చిన్న చిన్న సన్నివేశాలే తీశారట. ప్రభాస్ మూడు రోజుల పాటు షూటింగ్‌కు హాజరయ్యాడట. మిగతా నాలుగు రోజులు ఇతర నటీనటులపై సీన్లు తీశాడట మారుతి. ఇలాగే నెలలో కొన్ని రోజుల కాల్ షీట్లను మారుతి సినిమాకు కేటాయించనున్నాడు ప్రభాస్. మిగతా ఆర్టిస్టులతో కోఆర్డినేట్ చేసుకుని చిన్న చిన్న షెడ్యూళ్లతోనే సినిమాను ముందుకు తీసుకెళ్లబోతున్నారు. ఇలా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో లోపు సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్లో ‘ఆదిపురుష్’ రాబోతుండగా.. మూడో క్వార్టర్లో ‘సలార్’ రిలీజవుతుంది. కాబట్టి మధ్యలో మారుతి సినిమా విడుదల కోసం హడావుడి ఏమీ ఉండదని.. ఆ చిత్రాన్ని 2024 సంక్రాంతికి రిలీజ్ చేసే ఉద్దేశంతో ఉన్నారని.. ఇది కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఆ సీజనే కరెక్ట్ అని భావిస్తున్నారని సమాచారం. ప్రాజెక్ట్-కే 2024 వేసవి లేదా ఆ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. మారుతి-ప్రభాస్ సినిమాను పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తోంది.