దిల్ రాజు ఆ లాజిక్‌పై ఇప్పుడేమంటాడో?


నాలుగేళ్ల కిందట సంక్రాంతికి మూడు పెద్ద తెలుగు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ కాగా.. ఇంకొకటి రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’. ఇది కాక దిల్ రాజు నిర్మాణంలో విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఎఫ్-2’ సైతం ఆ పండక్కే రిలీజైంది.

ఐతే వీటికే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టంగా ఉంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తమిళ చిత్రం ‘పేట’ సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఐతే ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన ఓ నిర్మాత.. దానికి థియేటర్లు కేటాయించకపోవడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. దిల్ రాజును పరోక్షంగా తీవ్రంగా విమర్శించాడు. దీనికి దిల్ రాజు దీటుగానే బదులిచ్చాడు. ‘పేట’ సినిమా లేటుగా సంక్రాంతి రేసులోకి వచ్చిందని.. తెలుగు సినిమాలను కాదని అనువాద చిత్రానికి థియేటర్లు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు.

ఐతే కట్ చేస్తే ఇప్పుడు సంక్రాంతికి దిల్ రాజు నిర్మిస్తున్న ‘వారసుడు’ సినిమా రిలీజ్ కాబోతోంది. దాన్ని ద్విభాషా చిత్రంగా పేర్కొంటున్నప్పటికీ.. ప్రధానంగా తమిళ సినిమా అనే చెప్పాలి. ఈ మధ్య తెలుగు సినిమాల షూటింగ్స్‌ దాదాపు నెల రోజులు ఆపేయగా.. ‘వారసుడు’ మూవీ చిత్రీకరణ మాత్రం ఆగలేదు. ఇదేం న్యాయం అని దిల్ రాజును మీడియా వాళ్లు అడిగితే దాన్ని తమిళ సినిమాగా పేర్కొన్నాడు రాజు.

ఇక సంక్రాంతి పోటీ విషయానికి వస్తే ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్), వీరసింహారెడ్డి రిలీజ్ ఖరారు చేసుకున్నాయి. వీటికి తోడు ‘వారసుడు’ కూడా లైన్లో ఉంది. ఒకేసారి ఇన్ని సినిమాల పోటీ అంటే కచ్చితంగా థియేటర్ల విషయంలో గొడవలు తప్పవు. మరి దిల్ రాజు ఇంతకుముందు చెప్పిన లాజిక్ ప్రకారం తమిళ సినిమా అయిన ‘వారసుడు’కి థియేటర్ల కేటాయింపు విషయంలో వెనక్కి తగ్గుతారా.. మిగతా మూడు చిత్రాలకే పెద్ద పీట వేసేలా రాజీకి వస్తారా అన్నది ఆసక్తికరం. అలా కాకుండా ముందు చెప్పిన లాజిక్ పక్కన పెట్టి తన సినిమాకు ఎక్కువ థియేటర్లు అట్టి పెట్టుకుంటారా అన్నది చూడాలి.