చివరి శుక్రవారాన్ని వదిలేశారు

టాలీవుడ్ శుక్రవారాలు అయితే అతివృష్టి లేదా అనావృష్టిలా తయారయ్యాయి. ఒకేసారి రెండు కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తే దాని ప్రభావం పరస్పరం కలెక్షన్ల మీద ఉంటుందని తెలిసినా సరే పండగ అడ్వాంటేజ్ కోసమో లేదా లాంగ్ వీకెండ్ కోసమో లేనిపోని రిస్క్ చేస్తున్నారు. ఈ కారణంగానే పాజిటివ్ టాక్ వచ్చిన స్వాతిముత్యం కమర్షియల్ కోణంలో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీపావళికి కూడా అదే వరస రిపీట్ చేశారు. ఓరి దేవుడా, జిన్నా, సర్దార్, ప్రిన్స్ ఒకేరోజు బరిలో దిగాయి. వీటికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ కంటే హాలీవుడ్ మూవీ బ్లాక్ ఆడమ్ కు వచ్చిన రెస్పాన్స్ ఎక్కువంటే షాక్ కలగక మానదు.

సరే వీటిలో ఫైనల్ గా ఎవరు గెలిచారు ఎవరు ఓడారనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది కానీ అక్టోబర్ చివరి వారాన్ని మాత్రం మన నిర్మాతలు అనాథగా వదిలేశారు. ఆ రోజు చెప్పుకోదగ్గ పెద్ద రిలీజులేం లేవు. అనుకోని ప్రయాణం ఒకటే వస్తోంది. సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కరోనా టైంలో ఇద్దరు మిత్రుల ఎమోషనల్ జర్నీని ఇందులో ఆవిష్కరించే ప్రయత్నమేదో చేశారు. బాగున్నా లేకపోయినా దీనికి క్రౌడ్ ఫుల్ చేసేంత సీన్ అంత సులభంగా లేదు.

టపాసుల పండక్కు ఎలాగూ ఎక్కువ సినిమాలు వస్తున్నాయి కదా వాటికే రన్ సరిపోదని ఇంకెవరు రిస్క్ చేయలేదు కానీ ఈ అనుకోని ప్రయాణంతో ఒకటో రెండో బడ్జెట్ మూవీస్ ఏవైనా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. తిరిగి నవంబర్ 4న మళ్ళీ నాలుగైదు పోటీ పడుతున్నాయి. ఊరికే ఇలా కౌంట్ ఎక్కువగా ఉండటం వల్ల థియేటర్లకు ఫీడింగ్, జనాలతో సీట్ల లోడింగ్ రెండూ జరగనప్పుడు ఒకరో ఇద్దరో రాజీపడి కాస్తా ముందు వెనక్కు రిలీజ్ డేట్లు అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా. సీజన్ కన్నా టైమింగ్ ముఖ్యమనే సూత్రాన్ని మర్చిపోతే ఎలా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.