వీరమల్లుకి మళ్ళీ టెన్షన్

ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు మరోసారి పవన్ కళ్యాణ్ నిర్మాతలను టెన్షన్ పెడుతున్నాయి. విశాఖలో జరిగిన పరిణామాలకు నిరసనగా పవర్ స్టార్ ఓ రేంజ్ లో వైసిపి మీద ఎదురు దాడి చేయడం ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు కానీ ఇంతకన్నా దారుణంగా వీళ్ళే గతంలో దూషించిన దాఖలాలు ఉండటంతో సోషల్ మీడియాలోనూ పవన్ చర్యల పట్ల ఏమంత వ్యతిరేకత కనిపించడం లేదు. అయితే దీని ప్రభావం వచ్చే ఏడాది విడుదల కాబోయే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల మీద తప్పకుండా ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

ముఖ్యంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న హరిహరవీరమల్లు 2023 వేసవిలో రిలీజ్ కానుంది. కొత్త షెడ్యూల్ మొదలుపెట్టేందుకు ఇటీవలే ఒక వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఈలోగానే ఊహించని సంఘటనలు జరిగిపోయాయి. గతంలో వకీల్ సాబ్ టైంలో బెనిఫిట్ షోలు లేకుండా జగన్ సర్కార్ కట్టడి చేసిన విషయం అభిమానులు మర్చిపోలేదు. భీమ్లా నాయక్ కి ఏకంగా రెవిన్యూ అధికారులను థియేటర్ల వద్ద కాపలా పెట్టి టికెట్లను సాధారణ రేట్లకు అమ్మించారు. ఇది ఓవరాల్ కలెక్షన్ల మీద ప్రభావం చూపించింది. ఆ కారణం వల్లే కొన్ని ఏరియాల బయ్యర్లకు నష్టాలు తప్పలేదు.

కానీ వీరమల్లకు అలా చేస్తే దాని దెబ్బ తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి గ్రాండియర్లకు టికెట్ రేట్ల పెంపు చాలా అవసరం. అలా చేయడం వల్లే ఆర్ఆర్ఆర్ ఈజీగా గట్టెక్కగలిగింది. తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ ఎటొచ్చి పవన్ మీద కోపంతో ఏపీలో మళ్ళీ పాత చర్యలకు తెగబడితే ఆ భారమంతా నిర్మాత ఏఎం రత్నం మీద పడుతుంది. ఒకవేళ అక్కడిదాకా వస్తే తక్కువ రేట్లకు బిజినెస్ చేయాల్సి ఉంటుంది. వినోదయ సితం రీమేక్ లాంటివైతే ఈ సమస్య వచ్చేది కాదు కానీ మరి వీరమల్లు టైంకి ఈ వేడి చల్లారిపోతుందా అప్పటిదాకా మనసులో పెట్టుకుని భయపడినంతా చేస్తారా చూడాలి.