‘ఆదిపురుష్’ టీం డైలమా

‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్‌తో ‘తానాజీ’ లాంటి బ్లాక్‌బస్టర్ తీసిన ఓం రౌత్.. రామాయణ గాథ నేపథ్యంలో ‘ఆదిపరుష్’ సినిమాను ప్రకటించగానే దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో గొప్ప ఎగ్జైట్మెంట్ కనిపించింది. ప్రభాస్ చివరి రెండు చిత్రాలు నిరాశ పరిచినప్పటికీ.. ఈ సినిమాతో అతను బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని అంతా ఆశించారు. కానీ ‘ఆదిపరుష్’ టీజర్ చూశాక ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు తగ్గిపోయాయి.

ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు లేని విధంగా ఆ చిత్రం ట్రోల్‌కు గురైంది. టీజర్లో పురాణ పాత్రలను ప్రెజెంట్ చేసిన విధానం, విజువల్ ఎఫెక్ట్స్ మీద తీవ్ర విమర్శలే వచ్చాయి. దిద్దుబాటు చర్యల్లో భాగంగా త్రీడీ టీజర్‌ను ప్రెస్‌కు చూపించి నెగెటివిటీని తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇంకా సినిమా మీద జనాలకు పూర్తి భరోసా అయితే లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిద్ధం చేసిన సినిమాను యాజిటీజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఎలాంటి స్పందన వస్తుందో అన్న భయాలు చిత్ర బృందాన్ని వెంటాడుతున్నాయి.

సినిమాలో చాలా వరకు విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ సన్నివేశాలే ఉన్నాయి. కాబట్టి మార్పులు చేర్పులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత మేర కరెక్షన్లు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన జెన్యూన్ ఫీడ్ బ్యాక్‌ను తీసుకుని ఆ మేరకు మార్పులు చేర్పులు చేయడానికి చూస్తున్నారట. ఐతే పూర్తిగా ప్రేక్షకుల ఫీలింగ్‌కు తగ్గట్లు మార్చాలంటే మాత్రం చాలా సమయం పడుతుంది. సంక్రాంతి రిలీజ్ డేట్‌ను అందుకోవడం కష్టమవుతుంది. అలా అని ఉన్నదున్నట్లుగా వదిలేయలేరు.

మరి ఓ మోస్తరుగా కరెక్షన్లు చేసి సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేద్దామా.. లేక ఎక్కువ టైం తీసుకుని ప్రేక్షకులు కోరుకున్నట్లుగా మార్పులు చేర్పులు చేసి వేసవిలో సినిమాను రిలీజ్ చేద్దామా అనే విషయంలో చిత్ర బృందంలో తర్జన భర్జనలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సంక్రాంతి రిలీజ్‌ డేట్‌కే కట్టుబడ్డప్పటికీ.. సినిమాను వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదని ఇన్‌సైడ్ టాక్.