మెగా ఫ్యామిలీతో గొడవల గురించి

బంధుత్వం కన్నా స్నేహితులుగా ఎక్కువ చనువుగా ఉండే అల్లు అరవింద్, చిరంజీవి బంధం గురించి ఇండస్ట్రీలోనే కాదు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఎప్పటి నుంచో సదభిప్రాయం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా మెగా అల్లు కుటుంబాల మధ్య ఏదో గ్యాప్ వచ్చిందని, అందుకే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. దానికి తగ్గట్టుగానే పబ్లిక్ స్టేజిల మీద పరస్పర ప్రస్తావనలు ఉండటం లేదు. అటు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ దీని గురించే రెండుగా విడిపోయి అవసరం లేని ట్రోలింగ్ లు, గొడవలు చేసుకున్న సందర్భాలున్నాయి. ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది.

ఓ టీవీ ఛానల్ కోసం ఆలీకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ దీనికి సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు ఓపెన్ అయ్యారు. తన చెల్లిని ఇచ్చినప్పటి నుంచి తామిద్దరం బావ బావమరుదుల కన్నా ఫ్రెండ్స్ గానే ఉన్నామని, పిల్లలు పెరిగిపెద్దవుతున్న తరుణంలో ఎవరికి వాళ్ళు ఎదగాలనే లక్ష్యంతో వాళ్ళ మధ్య పోటీ ఉందని, అంతే తప్ప ఆ కారణంగా గొడవలు పడేంత సీన్ లేదని కుండ బద్దలు కొట్టేశారు. అంతేకాదు సంక్రాంతి, దీపావళి తదితర పండగలకు రెండు ఫ్యామిలీలు క్రమం తప్పకుండా కలుసుకుంటామని ప్రతిసారి ఆ వీడియోలు పెట్టలేమని తేల్చేశారు.

ఇదే కాదు ఇటీవలే జరిగిన అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు, అల్లు స్టూడియో ఓపెనింగ్ సందర్భంగా చిరంజీవి పంచుకున్న ఎన్నో విషయాలు అందరినీ ఆనందపరచడమే కాదు అల్లు అర్జున్ అయితే ఏకంగా ఎన్నడూ లేని రీతిలో పడి పడి నవ్వుతూ ఎంజాయ్ చేశాడు. ఈ ప్రస్తావన అలీనే గుర్తు చేశాడు. ఇదే వేడుకలో బన్నీ, రామ్ చరణ్, సాయితేజ్ లు చాలా సన్నిహితంగా మెలుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. మొత్తానికి ఏదో జరుగుతోందనే ప్రచారానికి ఈ రూపంలో చెక్ పెట్టేశారు. ఇలాగే ఆలీ భవిష్యత్తులో చిరంజీవిని కూడా అడిగేస్తే ఓ పనైపోతుందిగా.