ఆదిపురుష్ కోర్టు కథలు షురూ

సరిగ్గా ఇంకో తొంభై రోజుల్లో విడుదల కాబోతున్న ఆది పురుష్ మీద మెల్లగా కోర్టు వివాదాలు ముసురుకుంటున్నాయి. నిన్నా మొన్నటిదాకా కేవలం నోటి మాటగా అభ్యంతరాలు వ్యక్తమైతే తాజాగా వ్యవహారం లీగల్ కోటు వేసుకుంది.ఢిల్లీకి చెందిన రాజ్ గౌరవ్ అనే న్యాయవాది ఈ సినిమాను ఆపేయమని ఆదేశించాల్సిందిగా కేసు దాఖలు చేశాడు. ఇందులో ఉన్న అభ్యంతర విషయాల మీద ముఖ్యంగా రావణాసురుడి పాత్ర ఆహార్యాన్ని తప్పుగా చూపించారని అభియోగంలో పేర్కొన్నారు. రాముడిని సైతం ప్రశాంత వదనానికి భిన్నంగా వ్యతిరేక భావం కలిగేలా ఉందని టీజర్ ని ఉదహరిస్తూ ఆరోపణలు చేశారు.

ప్రస్తుతానికి ఆ లాయర్ తరఫున ప్రభాస్ సైఫ్ అలీ ఖాన్ తదితరులతో పాటు దర్శకుడు ఓం రౌత్ నిర్మాణ సంస్థ టి సిరీస్ లకు నోటీసులు వెళ్లాయని తెలిసింది. అయితే ఇవి కోర్టు నుంచి నేరుగా కాకుండా న్యాయవాది నుంచి వివరణ కోరుతూ వచ్చినట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదని, కేవలం నిమిషం వీడియో చూసి ఇలాంటి నిర్ధారణకు రావడం కరెక్ట్ కాదని, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేలా వ్యవహరించడం ఎంత వరకు సబబని, ఈ కోణంలోనే కౌంటర్లు దాఖలు చేయబోతున్నట్టు సమాచారం.

మొత్తానికి ఆది పురుష్ ప్రమోషన్లు పాజిటివ్ గా మొదలుకాకపోయినా దీని గురించి జనం మాట్లాడుకునేలా చేయడంలో చిత్ర బృందం సక్సెస్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్, ట్వీట్లు, కామెంట్లు గట్రా పక్కనపెడితే వాటివల్ల కలుగుతున్న డ్యామేజ్ కన్నా వస్తున్న పబ్లిసిటీనే ఎక్కువ. అసలు కోర్టు ప్రమేయం వల్ల ఆగిపోయిన సినిమా కానీ ల్యాబ్ లో మగ్గుతున్న మూవీ కానీ గత కొన్నేళ్లలో ఏదీ లేదు. అందులోనూ కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా ఉన్న టి సిరీస్ సంస్థకు ఇలాంటి చిక్కులు ఇబ్బంది పెట్టకపోవచ్చని ముంబై మీడియాలో వినిపిస్తోంది. జరిగేదంతా మంచికే అనేది ఆది పురుష్ కు సైతం అనుభమవుతోంది.