జల్సా రికార్డు బద్దలు కొట్టిన చెన్నకేశవరెడ్డి

టాలీవుడ్లో ఇప్పుడు చిత్రమైన పరిస్థితి నెలకొన్నాయి. ఓవైపు మంచి టాక్ తెచ్చుకున్న కొత్త చిత్రాలు కూడా పెద్దగా ప్రభావం చూపించకుండా థియేటర్ల నుంచి వెళ్లిపోతుండడం చూస్తున్నాం. అదే సమయంలో ఏళ్ల నాటి పాత సినిమాలకు స్పెషల్ షోలు వేస్తుంటే వాటిని ఆ హీరోల అభిమానులు ఎగబడి చూస్తున్నారు. ఒకప్పుడు సరిగా ఆడని సినిమాలు కూడా ఇప్పుడు వసూళ్ల మోత మోగిస్తున్నాయి.

ఈ మధ్య ‘3’ అనే తమిళ అనువాద చిత్రం కూడా రీరిలీజ్‌లో హౌస్‌ఫుల్స్‌తో రన్ అవడం ఆశ్చర్యం కలిగించ విషయం. అంతకుముందు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘పోకిరి’కి నెలకొన్న సందడి చూసి ఇండస్ట్రీ జనాలు కూడా ఆశ్చర్యపోయారు. ఆ సినిమాకు రికార్డు స్థాయిలో షోలు పడ్డాయి. అలాగే గ్రాస్ కూడా రికార్డు స్థాయిలోనే వచ్చింది. ఆ రికార్డును తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రీరిలీజైన ‘జల్సా’ బద్దలు కొట్టింది.

ఐతే ‘జల్సా’ రికార్డులు కూడా ఎంతో కాలం నిలవలేదు. గత నెల 25న ‘చెన్నకేశవరెడ్డి’ 20వ వార్షికోత్సవం సందర్బంగా నందమూరి అభిమానుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక యుఎస్‌లో సైతం పెద్ద ఎత్తున ఈ చిత్రానికి స్పెషల్ షోలు వేశారు. రీరిలీజ్‌లో ఈ సినిమాకు వచ్చిన హైప్ చూసి దర్శకుడు వి.వి.వినాయక్, నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రెస్ మీట్ కూడా పెట్టడం తెలిసిందే. అప్పుడే ఈ సినిమాకు రికార్డు రీరిలీజ్ అని వెల్లడించాడు సురేష్.

ఇప్పుడాయన తన చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అయిన ‘స్వాతిముత్యం’కు సంబంధించి ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్న సందర్భంగా ‘చెన్నకేశవరెడ్డి’ కలెక్షన్ల రికార్డు గురించి వెల్లడించారు. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ రూ.5.39 కోట్ల గ్రాస్ వచ్చినట్లు వెల్లడించాడు. ‘జల్సా’ గ్రాస్ నాలుగు కోట్ల లోపే కాగా.. పెద్ద మార్జిన్‌తోనే ‘చెన్నకేశవరెడ్డి’ రికార్డును బద్దలు కొట్టింది. ఇందులో షేర్ అమౌంట్‌ను ముందు చెప్పినట్లే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వనున్నట్లు సురేష్ తెలిపారు. అంతే కాక ఎన్టీఆర్ మూవీ ‘ఆది’కి పక్కాగా ప్లాన్ చేసి, ప్రమోట్ చేసి స్పెషల్ షోలు వేయబోతున్నట్లు ఆయన వెల్లడించడం నందమూరి అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చేదే.