ఒక లెటర్ తో సరిపెట్టేసిన నయనతార

ఆవిడంతే.. తనే ప్రొడ్యూస్ చేసుకున్న సినిమాలైనా లేదంటే ఇతరుల బ్యానర్లో హీరోయిన్ గా చేసిన సినిమాలైనా కూడా.. ప్రమోషన్లకు మాత్రం రాదు. కాకపోతే 2020 తరువాత సిట్యుయేషన్ పూర్తిగా మారిపోయింది. ప్రమోట్ చేస్తే కాని సినిమా రీచ్ అవ్వట్లేదు. అందుకే రాజమౌలి వంటి లెజెండ్స్ సినిమాలను ఏకంగా నెలలపాటు ప్రమోట్ చేస్తున్నారు. కాని ఇప్పుడైనా మన స్టార్ హీరోయిన్ నయనతారలో మార్పు వస్తుందని అనుకుంటే, ఆమె మాత్రం తన పందా తనదే అన్నట్లుగానే ప్రవర్తిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో మొదటి భార్య పాత్రలో కనిపించిన నయనతార, అప్పట్లో కూడా ప్రమోషన్లకు రాననే చెప్పిందని స్వయంగా చిరంజీవే ఒక సందర్బంలో చెప్పారు. అయితే ఇప్పుడు లూసిఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో చెల్లెలి పాత్రలో కనిపించిన ఈ కొత్త పెళ్ళికూతురును.. ప్రమోషన్లకు రావల్సిందిగా సినిమా టీమ్ కోరిందట. ఇంటర్యూలూ గట్రా ఇవ్వకపోయినా కూడా, కనీసం సక్సెస్ మీట్ కు రమ్మని అడిగరాట. కాస్త బిజీగా ఉన్నానని చెప్పేసిన నయనతార, మరోసారి ఆమెకు కాల్ చేస్తారేమోనని భావించి.. వెంటనే అభిమానులకు ఒక లెటర్ రాసేసింది.

గాడ్ ఫాదర్ లో చేసినందుకు చాలా ఆనందంగా ఉందని, మెగాస్టార్ చిరంజీవి వంటి గొప్ప వ్యక్తితో స్ర్కీన్ షేర్ చేసుకోవడం తనకు కలిగిన గొప్ప భాగ్యమని.. మొత్తం టీమ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ అమ్మడు ఒక ప్రెస్ నోట్ పంపింది. ఈ మధ్యన ఏ సినిమాకూ ఇటువంటి నోట్ రాయని నయన్, ఇప్పుడు సడన్ గా ఒక లేఖ పంపిందంటే ఎవరికి మాత్రం సందేహం రాదు చెప్పండి? అందుకే దాని గురించి ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందే. ఏంటోమరి.. సూపర్ స్టార్ అయిన తరువాత సినిమాలను ఎంత ప్రమోట్ చేస్తే అంత లాభం వస్తుంది కాని, ఈ నయన్ రివర్స్ గేర్లో ఎందుకు వెళ్తుందో ఆమెకే తెలియాలి.