ఇండస్ట్రీలో ఆత్మహత్యలు.. ఇంకా ఎన్ని చూడాలో

సినీ పరిశ్రమలో విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు అనారోగ్యం తీవ్రమై ప్రాణాలు వదిలితే.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కరోనా ప్రభావం మొదలయ్యాక గత నాలుగు నెలల్లో రెండంకెల సంఖ్యలో విషాదాంతాలు చూశాం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో. ఇంతకుముందెన్నడూ ఇంత తక్కువ మందిలో అంతమంది చనిపోలేదు.

గత నెలలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. తాజాగా కన్నడ యువ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా చిన్న స్థాయి సినీ, ఫిలిం సెలబ్రెటీలు గత కొన్ని నెలల్లో కొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఐతే సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాబోయే కొనని నెలల్లో ఇలాంటి విషాదాంతాలు మరిన్ని చూడాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కరోనా ప్రభావంతో దారుణంగా దెబ్బ తిన్న పరిశ్రమల్లో సినీ రంగం ముందుంటుంది. కరోనా వల్ల సినీ పరిశ్రమలో ఆర్థిక సంక్షోభానాకి తోడు తోడు.. సామాజిక సంబంధాలు బాగా దెబ్బ తినడం సినీ జనాల్ని డిప్రెషన్‌ వైపు నెడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుశాంత్‌ ఆత్మహత్యకు కారణాలేవైనా కానీ.. లాక్ డౌన్ లేకపోయి ఉంటే, మామూలు పరిస్థితుల్లో అయితే అతను అంతటి తీవ్ర నిర్ణయం తీసుకునేవాడు కాదన్నది సన్నిహితుల మాట.

లాక్ డౌన్‌లో ఎక్కువగా ఒంటరిగా ఉండటం వల్ల అతను డిప్రెషన్లోకి వెళ్లి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. ఫిలిం ఇండస్ట్రీ బయటికి చాలా కలర్పుల్‌గా కనిపిస్తుంది కానీ.. లోతుల్లోకి వెళ్లి చూస్తే ఇక్కడ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి బండి లాగిస్తుంటారు జనాలు.

ఇక్కడ ఆర్థిక స్థిరత్వం ఉన్న వాళ్లు చాలా తక్కువ శాతం. పని ఉంటే డబ్బులుంటాయి. లేదంటే లేదు. నిర్దిష్టమైన ఆదాయం ఎవరికీ ఉండదు. చాలామంది చాలీ చాలని ఆదాయంతోనే నెట్టుకొస్తుంటారు. ఇక సినీ రంగం అంటే మెయింటైనెన్స్ ఖర్చు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో నాలుగు నెలలుగా పని లేక, ఆదాయం లేక అల్లాడిపోతున్న జనాలెందరో. వీళ్లలో చాలామంది ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరూ ఎవరినీ ఆదుకునే పరిస్థితుల్లో లేరు.

ఎవరి మీదా జాలి చూపించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా నిరాదరణకు గురై.. తీవ్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా వల్ల అన్ని రంగాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నప్పటికీ.. బాగా ఎక్స్‌పోజ్ అయ్యేది సినీ రంగం కాబట్టి అక్కడ రాబోయే నెలల్లో ఇలాంటి విషాదాలు మరిన్ని చూడాల్సి రావచ్చని నిపుణులు అంటున్నారు.